Rambabu Hotel: దేశంలో రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల చిన్నచిన్న హోటల్స్ నుంచి పెద్దపెద్ద హోటల్స్ వరకు అన్ని హోటల్స్ లో టిఫిన్స్ ధరలు భారీగా పెరిగాయి. చిన్నచిన్న హోటల్స్ లో ప్లేట్ ఇడ్లీ తినాలంటే కనీసం 20 రూపాయలు ఖర్చు చేయాలి. పెద్ద హోటల్స్ లో అయితే 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అయితే 16 సంవత్సరాలుగా కేవలం రూపాయికి మాత్రమే తూర్పు గోదావరి జిల్లాలోని రాయభూపాలపట్నానికి చెందిన చిన రాంబాబు హోటల్ లో ఇడ్లీని విక్రయిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా ఇడ్లీ ధరను మాత్రం హోటల్ నిర్వాహకులు పెంచడం లేదు. ఈ హోటల్ లో మైసూర్ బోండా ధర కూడా రూపాయి కావడం గమనార్హం. సరుకుల ధరలు అంతకంతకూ పెరుగుతున్నా రాంబాబు ఇప్పటికీ రూపాయికే ఇడ్లీని ఇస్తుండటంతో అక్కడి ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
అయితే ధర తక్కువైనా రాంబాబు క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. రాంబాబు హోటల్ ప్రతిరోజూ పదుల సంఖ్యలో కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. తనకు హోటల్ నిర్వహణ ద్వారా లాభాలు రాకపోయినా నడిపిస్తున్నానని భవిష్యత్తులో కూడా రూపాయికే ఇడ్లీ ఇస్తానని రాంబాబు చెబుతున్నాడు. ఈ హోటల్ లో ఇడ్లీ తినడానికి ఇతర ప్రాంతాల వాసులు కూడా రాంబాబు హోటల్ కు వస్తున్నారు.
ఈ హోటల్ లో కస్టమర్లకు రెండు రకాల రుచికరమైన చట్నీలను ఇస్తారు. రాంబాబుకు హోటల్ నిర్వహణలో అతని కుటుంబ సభ్యులు సైతం ఎంతగానో సాయం చేస్తున్నారు. ఇంట్లోనే హోటల్ నిర్వహిస్తూ ఉండటం వల్ల అద్దె కట్టాల్సిన అవసరం లేదని రాంబాబు చెబుతున్నారు.