Mushrooms: దేశంలోని యువరైతులకు కరోనా వైరస్ ఎన్నో సవాళ్లను విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఒక రైతు మాత్రం ప్రభుత్వ సహాయంతో ప్రస్తుతం ఇతరులకు ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు. విశాఖ జిల్లా నాతవరం మండలంలోని వెదురుపల్లి గ్రామానికి చెందిన చిత్రాడ వెంకటేశ్వరరావుకు బాల్యం నుంచి పుట్టగొడుగుల పెంపకం అంటే ఎంతో ఆసక్తి ఉండేది. పుట్టగొడుగుల ఉత్పత్తిపై అవగాహన పెంచుకున్న వెంకటేశ్వరరావు 2018 సంవత్సరంలో అప్పు చేసి యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు.
బెంగళూరు నుంచి విత్తనాలను కొనుగోలు చేసి స్థానికంగా దొరికే వ్యర్థాల ద్వారా పాల రకం పుట్టగొడుగుల పెంపకంను మొదలుపెట్టారు. మొదట్లో రోజుకు 20 కేజీల పుట్టగొడుగులను ఉత్పత్తి చేసి విక్రయించేవారు. ఆ తర్వాత ఉద్యానవన శాఖ అధికారులు ప్రభుత్వంతో 20 లక్షల రూపాయిల రుణం మంజూరు చేయించి మంజూరు చేయించిన రుణంలో 40 శాతం సబ్సిడీ ఇచ్చేలా చేశారు. ప్రస్తుతం వెంకటేశ్వరరావు నెలకు 1000 కేజీల పుట్టగొడుగులను తయారు చేస్తుండటం గమనార్హం.
వెంకటేశ్వరరావు ఈ పుట్టగొడుగులను హోల్ సేల్ షాపులకు సరఫరా చేస్తున్నారు. నెలకు లక్షా 50వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు. 10 లక్షల రూపాయల ఖర్చు చేసి సొంతంగా విత్తనాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసుకుని వెంకటేశ్వరరావు భారీ లాభాలను అందుకున్నారు. కేజీ విత్తనాలను 80 రూపాయలకు సరఫరా చేస్తున్నామని వెంకటేశ్వరరావు తెలిపారు.
విశాఖ జిల్లాలో తమ యూనిట్ మినహా మరో యూనిట్ లేదని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో ఉన్న పుట్టగొడుగుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు.