Shyamala: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో వివాదాస్పదం ముద్ర లేకుండా చూడాలని నాయకత్వం భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా టీవీ యాంకర్ శ్యామల లాంటి వారిని పార్టీకి దూరంగా ఉంచుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం లేదు. అయితే పార్టీ ఆమెను గడప తొక్కనీయడం లేదన్న కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బుల్లితెరను విడిచిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్యామల ఆ పార్టీకి ఫైర్ బ్రాండ్ గా మారుతారని అంతా భావించారు. అయితే గత పది నెలలుగా వైయస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ పార్టీలో ఆమె అధికార ప్రతినిధిగా ఉన్నారు. కానీ ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు.
* అధికార ప్రతినిధి హోదా..
యాంకర్ శ్యామల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధి హోదా దక్కించుకోవడం చాలా మందికి ఇష్టం లేదు. పార్టీలోనే ఆమెకు వ్యతిరేక వర్గం ఒకటి ఉంది. గత పది నెలల కాలంలో ఆమె రాకపోవడం వెనుక ప్రత్యర్థుల హస్తము ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇటీవల ఆమెను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్న విమర్శ బయటకు రావడంతో జాగ్రత్త పడ్డారు. తనపై జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు. అయితే అది పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ద్వారా కాకుండా.. సోషల్ మీడియా ద్వారా చెప్పడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పై తనకు ఎంతటి విధేయత ఉందో.. చెప్పేందుకు శ్యామల సుదీర్ఘమైన వీడియో పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. అంత విధేయత ప్రదర్శించాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు శ్యామలకు ఏర్పడిందన్నమాట. అంటే తెరవెనుక చాలా జరిగిందని ఇట్టే అర్థమవుతోంది.
* పార్టీలో ప్రత్యర్థి వర్గం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నోరున్న నేతలది పెత్తనం. అక్కడ గుర్తింపు రావాలంటే గట్టిగా మాట్లాడాలి. అయితే యాంకర్ శ్యామలకు పార్టీతో పాటు అధినేత వద్ద ప్రాధాన్యత పెరుగుతుండడంతో కొంతమంది తట్టుకోలేక పోయారు. అయితే ఆమె సోషల్ మీడియాకు అడ్డంగా బుక్ అవుతుండడం కూడా పార్టీకి మైనస్ గా మారుతుంది. అందుకే ఆమెను ప్రాధాన్యత క్రమంలో పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తోంది. పది నెలలుగా ఒక్కసారి కూడా పార్టీ తరఫున మాట్లాడే ఛాన్స్ ఆమెకు దక్కలేదు. దీంతో తన విధేయత వీడియో జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్తే.. ఆయన కొంత మెత్తబడి మళ్లీ అవకాశం ఇస్తారని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్యామల పని అయిపోయిందని పార్టీలోని ఒక వర్గం గట్టిగా నమ్ముతోంది. కానీ ఆమె మాత్రం నేను ఇక్కడే ఉన్నానని నిరూపించుకోవడానికి తంటాలు పడుతున్నారు.