YSR Congress Party protest: ఏ రాజకీయ పార్టీ కైనా ప్రజా పోరాటాలే ఊపిరి పోస్తాయి. అందులోనూ ప్రతిపక్ష పార్టీ ఈ విషయంలో ముందుండాలి. లేకుంటే వెనుకబడిపోతుంది. అయితే గత రెండేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలు అనుకున్న స్థాయిలో చేయలేకపోయింది. మధ్యలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై పోరాటం చేసింది కానీ.. అనుకున్న స్థాయిలో ఆ పార్టీకి మైలేజ్ రాలేదు. అన్నింటికీ మించి జగన్మోహన్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలకు ముందుకు రాకపోవడం ఆ పార్టీకి మైనస్. అయితే ఇప్పుడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళనలకు పిలుపునిచ్చింది వైసిపి నాయకత్వం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుపుతోంది. ఎట్టకేలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాల్లో భాగంగా రోడ్డు ఎక్కినట్లు అయ్యింది.
అంతర్జాతీయ పరిస్థితులతో..
పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరను పెంచాయి. మూడు రూపాయలకు పైగా లీటరు పెట్రోల్ డీజిల్ పై పెరిగింది. దీనిని సాకుగా తీసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. మొన్ననే పెట్రోల్ కొరతపై ఆ పార్టీ నేతలు ఆందోళనలు జరిపారు. కానీ ఆలస్యం జరిగింది. దీంతో అనుకున్న మైలేజీ సాధించలేకపోయారు. ఈసారి మాత్రం ముందే మేల్కొంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరపాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. దీంతో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డు ఎక్కారు.
ప్రజా పోరాటాలకు దూరం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రజా పోరాటాలు చేసింది లేదు. కేవలం ఆ పార్టీ నేతల అరెస్టులు, కేసులపైనే పోరాటం చేసింది తప్ప ప్రజల కోసం ఏమి చేయలేదన్న విమర్శ ఉంది. జగన్మోహన్ రెడ్డి సైతం ప్రజా పోరాటాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కేవలం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పై విమర్శలు చేయడం తప్ప.. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పెట్రోల్ ధరల పెంపు అనేది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎక్కువగా ఉంది ఈ పరిస్థితి. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే కొంత ఫలితం ఉంటుంది. కానీ చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ నేతలు యాక్టివ్ కావడం లేదు. ఆందోళనలు కూడా పరిమిత నియోజకవర్గాల్లోనే జరుగుతున్నాయి. దీంతో ఇది ఆ పార్టీకి సరైన మైలేజ్ ఇవ్వడంలేదు. పైగా అధినేత జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం లేదు. అదే ఎక్కువగా మైనస్ గా మారుతుంది. ప్రజల్లోకి వెళ్లడం లేదు.