YS Jagan Political Challenges: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాపుల ప్రాధాన్యతను గుర్తించింది. కాపులు స్పష్టంగా ఇంకా కూటమి వైపు ఉన్నారని బలంగా నమ్ముతోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కూడా తమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తోంది. అందుకే కాపు నేతల ఆత్మీయ సమావేశాల పేరుతో రాజకీయం మొదలుపెట్టింది. ఎంతో కొంత కాపుల్లో చీలిక తేవాలన్న ప్రయత్నం ప్రారంభించింది. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం నాలుగు జిల్లాలను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త గేమ్ ఆడుతున్నారు. దాదాపు ఒక 50 నియోజకవర్గాల్లో కాపుల్లో మార్పు వస్తే కూటమి దూకుడును తగ్గించవచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా నాలుగు జిల్లాల్లోనే కాపుల ఆత్మీయ సభలు పెట్టాలని వైసీపీ కాపు నేతలను పురమాయించారు జగన్. అయితే అంతలా భయపెడుతున్నాయి ఆ నాలుగు జిల్లాలు జగన్మోహన్ రెడ్డిని. అందుకే ముందుగానే మేల్కొని అలర్ట్ అయ్యారు.
నిన్న తొలి సమావేశం..
నిన్ననే గోదావరి జిల్లాల్లో వైసిపి కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. తరువాత సమావేశాలు విజయవాడతో పాటు విశాఖలో నిర్వహించాలని నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ కాపులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారన్నది జగన్ ఆలోచన. అదే సమయంలో తనకు కుల భావన లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్తున్నారు. గాని కాపు సామాజిక వర్గంలో మాత్రం పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో పాటు అభిమానం ఉంది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవరపెడుతోంది. కూటమి నుంచి పవన్ బయటకు వస్తారు అనుకుంటే మరో 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుందని బలంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వను అంటూ తేల్చేస్తున్నారు. అందుకే ఇప్పుడు జగన్ తన సొంత పార్టీ కాపు నేతలతో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
50 నియోజకవర్గాల పై ప్రభావం…
రాష్ట్రంలో కాపు జనాభా అధికంగా ఉన్న జిల్లాలు విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణాజిల్లా. దాదాపు నియోజకవర్గాలకు పైగా కాపుల ప్రభావం నిర్దిష్టంగా ఉంటుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో కాపులు ఏకపక్షంగా కూటమికి మద్దతు తెలపడంతో 50 వేల మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాలే అధికం. కనీసం 20 వేల మెజారిటీ తగ్గని నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి చోట కాపుల్లో చీలిక తేకపోతే మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఖాయం. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో నాయకులు యాక్టివ్ కాలేదు. కూటమికి వచ్చిన మెజారిటీ చూసి తెగ ఆందోళనకు గురయ్యారు వైసిపి నేతలు. అందుకే ఇప్పుడు వారిలో ధైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. అది కూడా ఆ నాలుగు జిల్లాలను టార్గెట్ చేసుకునే. అయితే గత అనుభవాల దృష్ట్యా కాపులు అంత సులువుగా వైసీపీకి టర్న్ అయ్యే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
