YS Rajasekhara Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో.. విపరీతమైన సెంటిమెంట్ పునాదులతో నిర్మించిన పార్టీ అది. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కుమారుడుగా మాత్రమే ఈ రాష్ట్రానికి సుపరిచితం అయ్యేవారు. ఆయనకంటూ ఏం ప్రత్యేకత ఉండేది కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి తన మరణాన్ని కుమారుడుకు అధికార వరంగా మార్చేశారు. ఆయన మరణంతో ఏర్పడిన సానుభూతితో ఉద్భవించినదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి చనిపోయి వైసిపికి ఉపయోగపడ్డారు. కానీ అదే వైసిపి రాజశేఖర్ రెడ్డి కి ఎంత మాత్రం కృతజ్ఞత చూపడం లేదు అనేది ఒక విమర్శ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి వైసీపీ నేతలు ముఖం చాటేయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఇది కచ్చితంగా రాజశేఖర్ రెడ్డి కి వంచించడమే అన్న భావన ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది.
* ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం.
రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన పేరుతో అవార్డులు అందిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నారు. ఆ కార్యక్రమానికి వైసీపీ నేతలు ఎవరు హాజరు కాకపోవడం విమర్శలకు తావిచ్చింది. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆ పార్టీ ముఖ్యమంత్రి గా ఉంటూ చనిపోయారు. అటువంటి నాయకుడి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఏటా నిర్వహిస్తూ వస్తోంది. కానీ ఆయన పేరుతో, ఆయన మరణంతో వచ్చిన సానుభూతితో.. ఏర్పాటై అధికారంలోకి వచ్చిన వైసీపీ నుంచి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
* అప్పట్లో సైతం..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పథకాలకు రాజశేఖర్ రెడ్డి పేరు వినిపించేది. అయితే తండ్రికి మించి జగన్ తన పేరును ఎక్కువగా పథకాలకు పెట్టుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి అనే నేత ఉమ్మడి ఏపీ రాజకీయాలను శాసిస్తూ.. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసారు. ఆ కృతజ్ఞతా భావంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఆయన పేరుతో పార్టీ పెట్టుకున్న వైసీపీ నుంచి మాత్రం అది కనిపించడం లేదు. అది కనిపించి ఉంటే ఈరోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి కచ్చితంగా పార్టీ నేతలు హాజరవుతారు. జగన్మోహన్ రెడ్డి పంపిస్తారు కూడా. కానీ వైసీపీ నేతలు ఎవరూ హాజరు కాలేదు అంటే కచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని పని.