AP Elections 2024: ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతోంది. ఉదయం 7:00 నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అటు పోలింగ్ ప్రక్రియలో సైతం చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. విషాద ఘటనలు, తోపులాటలు, గలాటాలు జరుగుతున్నాయి.గుంటూరు జిల్లాలో సామాన్య ఓటర్ పై వైసీపీ అభ్యర్థి చేయి చేసుకోగా… బాధిత ఓటర్ సదరు నేత చెంప చెల్లుమనిపించాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారాయి.
తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగాసిట్టింగ్ ఎమ్మెల్యే శివకుమార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పోలింగ్ ప్రారంభం కాగా.. శివకుమార్ ఓటు వేసేందుకు కేంద్రానికి వచ్చారు. అప్పటికే ఓటర్లు బారులు తీరారు. శివకుమార్ క్యూ లైన్ లో కాకుండా నేరుగా ఓటు వేసేందుకు వెళ్లారు. దీనిపై క్యూలో ఉన్నవారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శివకుమార్ ఓ యువకుడి పై చేయి చేసుకున్నారు. దీంతో సదరు యువకుడు కూడా శివకుమార్ చెంపపై గట్టిగా కొట్టాడు. ఈ నేపథ్యంలో శివకుమార్ అనుచరులు వచ్చి సదరు యువకుడిపై దాడి చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర పోషించారు. ఈ ఘటనపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సామాన్య ఓటర్లు నేరుగా వైసీపీ అభ్యర్థికి అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. సాధారణంగా అభ్యర్థులు గాని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఓటు వేయడానికి ముందుకు వస్తే.. స్థానిక ప్రజలు ఆహ్వానించి వారికి అవకాశం ఇస్తారు. కానీ తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్ క్యూ లైన్ లో కాకుండా నేరుగా వెళ్లడానికి ప్రయత్నించగా ఓటర్లు అడ్డుకున్నారు. వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి.. ఓటర్ల నుంచి కూడా చీత్కారాలు ఎదుర్కొంటున్నారని టాక్ ప్రారంభమైంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More