YS Sharmila: కడప నుంచి వైయస్ షర్మిల పోటీ దాదాపు ఖాయమే.ఇంకా అధికారిక ప్రకటన రావడమే తరువాయి. తొలిసారి కడపలో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య పోటీ జరగనుంది. కడప అంటేనే వైఎస్ కుటుంబం. అటువంటి చోటే ఆ కుటుంబ సభ్యుల మధ్య పోటీ అంటే ఈ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కడప సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఈయన వరుసకు షర్మిలకు తమ్ముడు అవుతాడు. వీరంతా ఒకే వంశవృక్షానికి చెందినవారు. దీంతో అందరి దృష్టి కడపపైనే ఉంది.
అన్నింటికీ మించి ఈ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రభావం చూపే అవకాశం ఉంది. వివేక హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడనేది సిబీఐ కూడా చెబుతున్న మాట. అందుకే ఈ ఎన్నిక ఒక రెఫరండం గా మారే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే వివేక హత్య వెనుక వైసీపీ నాయకులు ఉన్నారన్న వాదనను ప్రజలు అంగీకరించలేదని బలమైన సంకేతాలు ఇవ్వొచ్చు. అదే షర్మిల కానీ.. ఆమె చీల్చే ఓట్లతో టిడిపి గెలుపొందితే మాత్రం వైసీపీకి ఇబ్బందికర పరిణామం. ఒక్క కడప పార్లమెంట్ స్థానమే కాదు.. దాని పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలపై సైతం ఆ ప్రభావం చూపుతుంది. వైసీపీకి భారీ మూల్యం తప్పదు. వైయస్ కుటుంబ చరిత్ర కూడా మసకబారుతుంది.
కడప పార్లమెంట్ స్థానం పరిధిలో బద్వేలు,కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలు వైసిపి పరమయ్యాయి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు.. వైయస్ కుటుంబంలో నెలకొన్న పరిస్థితులు కూడా తోడు కానున్నాయి. షర్మిల వైపు సానుభూతి నడిచినా, వైయస్ కుటుంబ అభిమానులు మొగ్గు చూపినా.. వైసీపీకి భారీ ప్రమాదమే. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో షర్మిల దిగనుండడంతో ఆమెకు ఈ ఎన్నికలు ఒక హెచ్చరికలా పని చేస్తాయి. తాను గెలుపొందడమే కాదు.. వైసీపీకి దారుణంగా దెబ్బతీయాలని షర్మిల భావిస్తున్నారు. అంటే ఆమె రెండు లక్ష్యాలతో అడుగులు వేస్తున్నారు. ఒకటి తాను గెలవడం, రెండోది వైసీపీ ఓటమి. ఇందులో ఏ ఒక్కటి దక్కినా ఆమెకు సంతృప్తికరమే. ఎటు మూల్యం చెల్లించుకునేది వైసీపీయే. అందుకే ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేస్తోంది. మరిఎవరి లక్ష్యం నెరవేరుతుందో? ఎవరికి విజయం దక్కుతుందో? అన్నది ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే.