Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన విలువైన ఆస్తులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బహిరంగ వేలం వేయడం ద్వారా వాటిని విక్రయించాలని చూస్తోంది. ప్లాంట్ కు సంబంధించి 93,572 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 459 ప్లాట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అసెట్ మానిటేషన్ ప్రక్రియ ద్వారా.. ఈ ప్లాట్ల విక్రయానికి ఏర్పాట్లు చేస్తోంది. నిధుల సమీకరణ లక్ష్యంగా స్థలాల విక్రయాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెబుతూనే.. ఆస్తులను విక్రయిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ భూములన్ని ప్లాంట్ పరిధిలోనివి కావు. విశాఖ నగరంలో వినియోగంలో లేని భూములు మాత్రమే.
విలువైన భూములు..
విశాఖ నగరవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ కు విలువైన భూములు ఉన్నాయి. కేవలం వాటిని విక్రయించేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా సమీకరించిన నిధులు లోటును తీర్చుకునేందుకు అని తెలుస్తోంది. మద్దిలపాలెం లో 456 ప్లాట్లు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కు. గాజువాక పారిశ్రామిక వాడలో సైతం భారీ ఎత్తున స్థలం ఉంది. వాటిని విక్రయించి లోటును పూడ్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.. అక్టోబరు 12, 16 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా ఆ భూముల విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ పరిధిలోని భూములు కాకపోవడం ఉపశమనం కలిగించే విషయం.
ఈ వేలం నిర్వహణ..
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ రైల్ లెట్ ఈ వేలం నిర్వహిస్తోంది. పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని చూస్తోంది. దేశవ్యాప్తంగా బిల్డర్లు, రియల్టర్లు ఈ వేలంలో పాల్గొనవచ్చు. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం సంస్థను గట్టెక్కించేందుకు ఈ భూముల విక్రయం చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అనేక అంశాలు ఆందోళన కలిగించాయి. ఇప్పుడు ఈ భూముల విక్రయం సైతం ఆందోళన కలిగిస్తోంది. కానీ దీనికి స్టీల్ ప్లాంట్ తో సంబంధం లేదని.. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం సంస్థ స్టీల్ ప్లాంట్ కు వినియోగంలో లేని ఆస్తులను మాత్రమే విక్రయించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కార్మికులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదంటూ సూచించినట్లు సమాచారం.