AP Politics : ఏపీ రాజకీయాలు అంటేనే ఒక రకమైన అపవాదు ఉంది. నోరు తెరిస్తే బూతులు, తిట్ల దండకానికి నేతలు దిగుతారన్న కామెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా వైసిపి మంత్రులు, మాజీ మంత్రుల మాటలు వివాదాస్పదమయ్యాయి. అలాగని ప్రతిపక్ష నేతలు ఏం తక్కువ కాదు. వారిలో కూడా చాలామంది తిట్లదండకంలో ఆరితేరిన వారే. అయితే రాజకీయాలంటేనే ఏహ్య భావం కలిగేలా.. ఏపీలో కొందరు నేతలు మాటల తీరు కొనసాగడం విచారకరం. అధినేతల తీరుతోనే, వారిని ఆకట్టుకోవాలని చాలామంది బూతులను ఆశ్రయించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ నేతల నోటి దురుసు ఈ ఎన్నికల్లో కొంప ముంచుకున్నట్లు తెలుస్తోంది.
అధికార వైసీపీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు గత ఐదేళ్లుగా ఎన్నో రకాలుగా వివాదాస్పదమయ్యారు. వారు వాడిన భాష ఇబ్బందికరంగా ఉండేది. అయితే అప్పుడే కాదు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అదే భాష వాడుతుండడం వారికి ప్రతికూలంగా మారుతుంది. ముఖ్యంగా గుడివాడ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నాని, నగిరి నుంచి బరిలో దిగిన మంత్రి రోజా, నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్, సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నా అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, వల్లభనేని వంశీ వంటి వారికి డేంజర్ బెల్స్ మోగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే వారు వాడిన భాష వైసిపి శ్రేణులకు ఫ్యాషన్ గా అనిపిస్తుంది. అబ్బో గొప్ప మాటలుగా వారు అభివర్ణిస్తుంటారు. వారిని హీరోలుగా చూస్తుంటారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. తటస్తులు, ఏ పార్టీతో సంబంధం లేని వారు, విద్యాధికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు.. వీరు ఉపయోగించే భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సభ్య సమాజంలో అటువంటి వారికి స్థానం లేదని చెబుతున్నారు. అయితే వీరు మాట్లాడే మాటలు నియోజకవర్గంలో వారికి ప్రయోజనం చేకూరుస్తాయి కానీ.. రాష్ట్రస్థాయిలో మాత్రం వారి పార్టీ విజయానికి గండి కొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి వ్యాఖ్యలు రోజురోజుకు శృతిమించడం, అవే బూతులు తిడుతుండడంతో సొంతవారికి సైతం రుచించని పరిస్థితి. ఇప్పటికే ఈ తరహా వ్యాఖ్యలు చేసే నాయకులు ఎదురీతున్నట్లు తెలుస్తోంది. సర్వేల్లో కూడా ఇదే స్పష్టమవుతోంది. కేవలం నోటి దురుసు మూలంగానే.. వీరంతా ఓడిపోతున్నారని తెలియడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 4న తమ మాటలతో జేజేతులా రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాం అన్న బాధ వారిలో వ్యక్తం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.