Jagan: వెనుకటి రోజుల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తర్వాతే రాజకీయ పార్టీలు హడావిడి చేసేవి. అభ్యర్థులు కరపత్రాలు, వాల్ పోస్టర్లతో జనాలను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. ఆ వాల్ పోస్టర్లు, కరపత్రాలలో పెద్ద హంగూ ఆర్భాటలు ఉండేవి కావు. సాదాసీదాగా కనిపించేవి. అక్కడిదాకా ఎందుకు 2014 క్రితం వరకు ఇంతటి స్థాయిలోనే ప్రచారం ఉండేది కాదు.. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లోకి కన్సల్టెన్సీలు ప్రవేశించాయో.. అప్పుడే అవి పూర్తిగా సినిమాటిక్ ప్రచారం లాగా మారిపోయాయి. 2014లో బిజెపికి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశాడు. నరేంద్ర మోడీని భావి భారత ప్రధానిగా.. ఈ సువిశాల దేశానికి రక్షకుడిగా ప్రచారం చేశాడు. అది సక్సెస్ అయింది. ఫలితంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా 10 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారు. 2014లో గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ను బిజెపి పక్కన పెట్టింది. ఆ తర్వాత అతడు ప్రాంతీయ పార్టీలకు పని చేయడం మొదలుపెట్టాడు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రెండవసారి విజయ సాధించిందంటే దానికి కారణం ప్రశాంత్ కిషోరే. అలాగని ప్రశాంత్ కిషోర్ పని చేసిన ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి రాలేదు.
ఐ ప్యాక్ కంటే ముందు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్ననెన్స్( సీఏజీ) అనే సంస్థను ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత దానిని ఐ ప్యాక్ గా మార్చారు. 2015 లో అందులో నుంచి వైదొలిగినట్టు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన బీహార్ లోని జన్ సూరజ్ పేరుతో ప్రచారం చేస్తున్నారు.. ఐ ప్యాక్ 2019లో వైసిపికి కన్సల్టెన్సీ చేసింది. అయితే దీని వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని చాలామంది అంటారు.. వాటిని బలపరిచే విధంగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన అనేక ఫోటోలు మీడియాలో చ
క్కర్లు కొట్టాయి. మొన్నటి వరకు అతడు జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడితో కనిపించడం.. ఈ ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశాడు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోసం ఐ ప్యాక్ పనిచేస్తూనే ఉంది. ” క్షేత్రస్థాయిలో స్థాయిలో పనిచేయడం.. ప్రజల నాడిని విశ్లేషించడం, క్లిష్టమైన రాజకీయ నైపుణ్యాలను తెరపైకి తేవడం ఐ ప్యాక్ ప్రధాన లక్ష్యాలు. 2019లో అవి వర్కౌట్ అయ్యాయి. అప్పటినుంచి ఐ ప్యాక్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తోంది. కాకపోతే గతంలో అనుసరించిన విధానాల కంటే ఇప్పుడు భిన్నమైన పద్ధతులు అనుసరిస్తున్నామని” ఐ ప్యాక్ సహా వ్యవస్థాపకుడు, డైరెక్టర్ రిషి రాజ్ సింగ్ అంటున్నారు. “సోషల్ మీడియా, బ్రాండింగ్, మార్కెటింగ్ చుట్టూ ఐ ప్యాక్ తిరుగుతుంది. అది మాత్రమే కాదు అట్టడుగు స్థాయిలో పనిచేయడం.. ప్రజల నాడీ విశ్లేషించడం.. లోతైన రాజకీయ ప్రభావాన్ని చూపించే వ్యూహాలు రూపొందించడంలో ఐ ప్యాక్ తోడ్పడుతుందని” రిషిరాజ్ సింగ్ వివరించారు.
మే 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది.. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఐ ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) పనిచేసింది. ఆ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ ఐ ప్యాక్ జగన్మోహన్ రెడ్డి కోసం పని చేస్తోంది. ఇందుకోసం ఐపాడ్ విజయవాడలో కేంద్ర కార్యాలయం.. ప్రతి జిల్లాలో కార్యాలయాలు.. నియోజకవర్గంలోనూ ఆఫీసులు ఏర్పాటు చేసింది. 2019 నాటి దృశ్యాన్ని 2024 లోనూ ఆవిష్కరించేందుకు ఐ ప్యాక్ విపరీతంగా ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే “గడపగడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్నే మా భవిష్యత్తు” అనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మినహా మిగతా వారంతా క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. మంత్రులు ప్రతి ఇంటికి తిరిగారు. ఇంటి గుమ్మాలకు స్టిక్కర్లు కూడా అంటించారు.
ప్రస్తుత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేపట్టిన సిద్ధం ఎన్నికల సభలు.. సినిమా అక్షరాలను పోలివున్న దాని లోగో.. దానిపైన జగన్ పిడికిలి గుర్తును ఐ ప్యాక్ విశేషంగా ప్రచారం చేసింది. సిద్ధం సభా వేదికలను అచ్చం సినిమా ఆడియో ఫంక్షన్ల స్టేజీల లాగా రూపొందించింది. ముఖ్యంగా వేదిక ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ర్యాంప్.. ఆ ర్యాంప్ పై నుంచి జగన్ అటూ, ఇటూ నడవడం.. ప్రజలకు అభివాదం చేయడం.. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలు మొత్తం వినడం.. జగన్ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో తీస్తున్న క్లోజప్ ఫోటోలు.. ఇవన్నీ కూడా ఐ ప్యాక్ చేస్తున్న సినిమాటిక్ ప్రచారంలో భాగమే. సిద్ధం తర్వాత ప్రస్తుతం చేపడుతున్న మేమంతా సిద్ధం.. బస్సు యాత్ర కూడా అలాంటిదే.. ఈ బస్సు యాత్రలో 2015 నుంచి 2019 మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు సంబంధించిన దృశ్యాలను, వీడియోలను ప్రసారం చేస్తున్నారు. 2017-19 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో అయితే పాదయాత్రలు చేశారో.. ఆ ప్రాంతాల్లోనే ప్రస్తుతం మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర నిర్వహిస్తుండడం పొలిటికల్ ప్రచారం మాత్రమే కాదని.. అందులో సినిమాటిక్ ఎలివేషన్ కూడా ఉందని ఐ ప్యాక్ సభ్యులు చెప్తున్నారు. ఇక ఈ ప్రచారం సందర్భంగా మా నమ్మకం నువ్వే జగన్ పాటను కూడా ప్లే చేస్తున్నారు. ఇక్కడితోనే ఐ ప్యాక్ సభ్యులు ఆగడం లేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని తగ్గేదేలే అనే డైలాగ్ నుంచి మొదలుపెడితే.. ఇటీవల కాలంలో బహుళ ప్రజాదరణ పొందిన తెలుగు సినిమాల ఐడియమ్స్ వరకు వాడుకుంటున్నారు. ఫలితంగా జనాల్లోకి వైసీపీ ప్రచారాన్ని మరింత ఆకర్షణీయంగా తీసుకెళ్తున్నారు.
ప్రచారం తర్వాత బూత్ స్థాయి శిక్షణలోనూ ఐ ప్యాక్ సరికొత్త విధానాన్ని అవలంబిస్తోంది. రాష్ట్రంలోని 50 వేల బూత్ లలో ప్రతి బూత్ కు 20 మంది వలంటీర్ల(ప్రభుత్వం నియమించిన వారు కాదు)ను నియమించారు. వీరిని పర్యవేక్షించేందుకు నలుగురు కమిటీ సభ్యులతో కూడిన బూత్ స్థాయి సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో ఇలా చేశారు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చానని భావిస్తున్నారు. మరి ఈసారి అంతకుమించి అనేలాగా ఐ ప్యాక్ వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం వస్తుందా? ఈ సినిమా టిక్ ప్రచారం మొత్తం గాలికి కొట్టుకుపోయే పేలపిండి అవుతుందా? అనేవి తేలాలంటే జూన్ 4 దాకా ఎదురుచూడాల్సిందే.