TDP Governor Post: దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల గవర్నర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. చాలా రాష్ట్రాల గవర్నర్లు పదవి విరమణ చేయనున్నారు. దీంతో వారికి కొనసాగింపు కానీ.. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కాని జరగాల్సి ఉంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగనుంది. పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న ప్రచారం నడుస్తోంది. అయితే అందులో చాలామందిని గవర్నర్లుగా నియమించినట్లు కూడా ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రధానంగా వచ్చే ఏడాది కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో సైతం కొత్త గవర్నర్లను నియమించినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా ఛాన్స్ ఇస్తారన్న ప్రచారం ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ పోస్ట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుండడం విశేషం. అయితే ఇప్పటికే చంద్రబాబుకు కేంద్ర పెద్దలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ సీనియర్ నేతను ఎంపిక చేసే పనిలో ఉన్నారట చంద్రబాబు.
* గోవా గవర్నర్ గా అశోక్..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ కేటాయించింది. పార్టీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజును ఎంపిక చేశారు చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాలనుంచి దూరమయ్యారు అశోక్. దీంతో ఆయన పేరును సిఫార్సు చేశారు చంద్రబాబు. ప్రస్తుతం అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేయడం.. చంద్రబాబు నాయకత్వం పట్ల విధేయత ఉండడంతో ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు అశోక్ గజపతిరాజు.
* యనమల లేదా ప్రతిభా భారతి..
దేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు బలపడకుండా రాజకీయ వ్యూహరచన చేస్తోంది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను మరింత దగ్గర చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ పోస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి లాంటి నేతలు ఉన్నారు. అయితే యనమల రామకృష్ణుడు కేంద్ర రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పైగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. దీంతో ఆయన పేరును గవర్నర్ పోస్ట్ కు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు ప్రతిభా భారతి పేరు కూడా వినిపిస్తోంది. ఆమె కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి చేపట్టారు. ఎస్సీ సామాజిక వర్గం చెందిన మహిళ కావడంతో ఆమెకు కలిసి వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..