Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సహాయం అందనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద రూ.10.120 కోట్ల ఆర్థిక సాయం లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తారు. మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు 42,70,802 మంది తల్లులు, సంరక్షకులు లబ్ధిదారులుగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 64,76,590 మంది విద్యార్థుల వివరాలు పరిశీలన పూర్తి చేసి.. 41,07,502 మంది తల్లుల ఖాతాల్లో ఈరోజు నిధులను జమ చేస్తారు.
* రూ. 2 వేలు మినహాయించి..
గత విద్యా సంవత్సరంలో 13 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. వాస్తవానికి 15వేల రూపాయల సాయం అందించాలి విద్యార్థులకు. అయితే పాఠశాలల్లో మౌలిక వసతులకు 2000 మినహాయించి.. 13వేల రూపాయలను అందిస్తున్నారు. మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్ ల ద్వారా తల్లికి పథకం అర్హుల వివరాలు తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో తల్లికి వందనం పథకం అమలు చేస్తోంది. తొలి విడతగా ఇప్పటికే యు డైస్ ద్వారా నమోదైన విద్యార్థులకు నేడు నిధులు జమ చేస్తారు. రెండో విడతలు ఈ ఏడాది కొత్తగా స్కూళ్లలో చేరిన విద్యార్థులకు ఆగస్టు 30న పథకాన్ని అమలు చేయనున్నారు.
* చెల్లింపులకు కొనసాగింపు..
ఈరోజు నుంచి మూడు రోజులపాటు లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియ కొనసాగుతుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా కొంతమంది విద్యార్థుల వివరాలు ధ్రువీకరించాల్సి ఉంది. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ లో చేరే వారికి రెండో విడతల డబ్బులు ఎకౌంట్లో జమ చేస్తారు. తల్లికి వందనం పథకం డబ్బులు జమ కావాలంటే బ్యాంక్ అకౌంట్ లకు ఆధార్ లింక్ తప్పనిసరి. ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తిగా ఆక్టివ్ ఉండాలి. ఈరోజు సచివాలయాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హుల జాబితాను ప్రదర్శిస్తారు. అనర్హుల జాబితా సైతం అందుబాటులో ఉంటుంది. అయితే అనర్హతకు సంబంధించి సరైన కారణం చూపుతారు. జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు లబ్ధిదారులు ఫిర్యాదు చేసుకోవచ్చు. సరైన పత్రాలు సమర్పిస్తే.. అధికారులు పరిశీలించి పథకాన్ని వర్తింపజేసే ఛాన్స్ ఉంటుంది.






