Rushikonda Buildings: రుషికొండ ( rushikonda ) భవనాల వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా నిధులతో విలాసవంతమైన భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ భవనాలు ఎందుకు నిర్మించారు కూడా అప్పటి ప్రభుత్వం చెప్పలేదు. విశాఖ నుంచి పాలనను సాగించే క్రమంలో సీఎం క్యాంప్ ఆఫీస్ గా మాత్రం అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ దానిపై అప్పటి ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు లోపల ఏం చేశారో అన్న దానిపై ఎవరికీ తెలియలేదు కూడా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ ప్యాలెస్ లోపల ఉన్న నిర్మాణాలు బయటపడ్డాయి. భారీ విలాసవంతమైన కట్టడాలతో పాటు నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ భవనాలను ఎలా వినియోగించుకోవాలని దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది కూటమి ప్రభుత్వం. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు ఆ కమిటీ సమావేశం కానుంది. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించనుంది. రాష్ట్ర క్యాబినెట్ లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయానికి రానుంది.
* విశాఖకు ల్యాండ్మార్క్.. విశాఖలో( Visakhapatnam) రుషికొండ అనేది ఒక ల్యాండ్ మార్క్. అక్కడ రిసార్ట్స్ల ద్వారా ఏడాదికి పర్యాటక శాఖకు 7 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. అటువంటి నిర్మాణాలను తొలగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. రిషికొండను పూర్తిగా తొలచి భారీ భవంతులను నిర్మించింది. అసలు అక్కడ ఏ నిర్మాణాలు జరుపుతున్నారు కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చేసింది. అప్పుడే మూడు రాజధానుల నిర్ణయం వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. అయితే పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన ఆ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం వినియోగిస్తారని మాత్రం ఒకరిద్దరు నేతలు బయటపెట్టారు. అయితే ఇంతలో కూటమి అధికారంలోకి రావడంతో ఆ నిర్మాణాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియలేదు. అప్పటివరకు ఏడాదికి 7 కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది అక్కడ ఉండే రిసార్ట్స్ ల వల్ల. ఆ ఆదాయం కోల్పోగా.. ఆ భారీ భవనాల నిర్వహణకు నెలకు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అందుకే ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
* పర్యాటక, ఆతిధ్య రంగాలకు..
పలుమార్లు మంత్రుల బృందం రుషికొండ భవనాలను పరిశీలించింది. అయితే అక్కడ హోటల్స్ వినియోగానికి ప్రైవేటు హోటల్స్ ముందుకు వచ్చాయి.. ఆ భవనాలను పర్యాటక రంగంతో పాటు ఆతిధ్య రంగానికి ఉపయోగించుకోవాలని సదరు ప్రైవేటు సంస్థలు భావిస్తున్నాయి. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే కాదు ఆ భవనాల నిర్వహణ కూడా తప్పుతుంది. ఇప్పటికే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చింది క్యాబినెట్ సబ్ కమిటీ. మరోవైపు అంతర్జాతీయ ఎగ్జిబిషన్ నిర్వహణకు సైతం ఆమోదయోగ్యంగా ఉంటుందని గుర్తించింది. రకరకాల ప్రతిపాదనలకు సంబంధించి క్యాబినెట్ సభ కమిటీ ఈరోజు చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించనుంది. సీఎం చంద్రబాబు క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయానికి రానున్నారు.