Ration Cards In AP: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని చూస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. ఈ నెలలో రెండు కీలక సంక్షేమ పథకాలను అమలు చేయనుంది. మరోవైపు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనుంది. అర్హులు తమ దరఖాస్తులను సచివాలయంలో అందిస్తే.. సంబంధిత సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ప్రభుత్వం అర్హులను గుర్తించి రేషన్ కార్డులను జారీ చేయనుంది. త్వరలో సంక్షేమ పథకాలు అమలు చేయనున్న దృష్ట్యా ఈ రేషన్ కార్డులను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. అందుకే ఇప్పుడు రేషన్ కార్డుల కోసం లక్షలాదిమంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఈరోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: యుద్ధం అంటూ వస్తే.. ట్రంప్ మద్దతు భారత్ కా? పాకిస్తాన్ కా? క్లారిటీ ఇదే!
* లబ్ధిదారుల ఎదురుచూపు…
రాష్ట్రంలో లక్షలాదిమంది రేషన్ కార్డుల( ration cards ) కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏడాది రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపడుతామని హామీ ఇచ్చింది. కానీ ఎన్నికలకు ఏడాది ముందు వరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. ఈ తరుణంలో కొత్తగా పెళ్లయిన వారితో పాటు.. కుటుంబంలో వేరే కాపురం పెట్టిన వారికి ఈ రేషన్ కార్డులు దక్కకుండా పోయాయి. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం కొత్త రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. సరిగ్గా అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అర్హుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.
* గతంలో బినామీలకు పెద్దపీట..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున బినామీలకు రేషన్ కార్డులు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ కేవైసీ నమోదు ప్రక్రియ అందులో భాగమే. తొలుత మార్చి 31 వరకు ఈ కేవైసీకి గడువు విధించింది కూటమి ప్రభుత్వం. అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులంతా తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని సూచించింది. అయితే చాలామంది రేషన్ లబ్ధిదారులు ఈ కేవైసీ ని పూర్తి చేయలేకపోయారు. దీంతో కూటమి ప్రభుత్వం మరో నెల రోజులపాటు గడువు పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించింది. అయినా సరే రేషన్ కార్డు లబ్ధిదారుల నుంచి ఆశించిన స్థాయిలో ఈ ప్రక్రియ పై ఆసక్తి చూపలేదు. దీంతో మరో రెండు నెలల పాటు ప్రభుత్వం గడువు పెంచింది. అదే సమయంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానించింది.
* సంక్షేమ పథకాలకు మోక్షం..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. దీంతో ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. అందుకే కీలక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించింది. అయితే అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు ప్రాతిపదిక కావడంతో.. ముందుగా ఆ కార్డుల జారీ ప్రక్రియకు నిర్ణయించింది. అందులో భాగంగానే ఈరోజు నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా అర్హులకు రేషన్ కార్డుల జారీకి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. నేటి నుంచి రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Also Read: రోహిత్ 7, రికెల్టన్ 2.. ముంబైకి ఏ మంత్రవేశావయ్య గిల్..