Pawankalyan : రాజకీయాల్లో ఛాలెంజింగ్ కు ప్రజలు ఎక్కువ మొగ్గుచూపుతారు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ కంటే మరో ఉదాహరణ ఉండదు. నాడు దేశంలో బలీయమైన శక్తిగా ఉన్న సోనియా గాంధీని ఎదరించడంతోనే జగన్ అంతలా ప్రాచుర్యం పొందారు. తండ్రి ఇమేజ్ కు తోడు కాంగ్రెస్ హైకమాండ్ కు ఛాలెంజ్ చేయడంతో నే ప్రజలు కూడా గుర్తించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఛాలెంజింగ్ తోనే తన శక్తిని పెంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ ను స్థాపించిన ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తనతో పాటు కొద్దిమందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. నాడు కాంగ్రెస్ నాయకత్వంతో మాటకు మాట రావడంతో ఛాలెంజ్ చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఉప ఎన్నికల్లో గెలిచి తెలంగాణ సెంటిమెంట్ ను సజీవంగా ఉంచుకున్నారు. అదే కాంగ్రెస్ ను వెనక్కి తోసి మరీ తెలంగాణలో పట్టు బిగించారు.
అటువంటి ఛాలెంజింగ్ ను స్వీకరించే అరుదైన అవకాశం పవన్ కళ్యాణ్ కు వచ్చింది. ప్రస్తుతం పవన్, ముద్రగడ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దమ్ముంటే పిఠాపురంలో తనపై పోటీచేసి గెలవాలని పవన్ కు ముద్రగడ సవాల్ చేశారు. ఈ సవాల్ ను కానీ పవన్ స్వీకరించినట్టయితే మాత్రం జనసేనాని గెలుపు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక కాకుండా పిఠాపురం నుంచి పవన్ పోటీచేసి ఉంటే సునాయాస విజయం ఖాయమని ఇప్పటికీ విశ్లేషణలు వెలువడుతుంటాయి. నియోజకవర్గంలో కాపుల బలం సాలీడ్. ఇక్కడ ముద్రగడ కంటే పవన్ అభిమానులే అధికం. పైగా ముద్రగడ అవుట్ డేటెడ్. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమాన్ని నిలపివేయడంతో ఒక రకమైన అపవాదును మూటగట్టుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ బరిలో నిలిచే నియోజకవర్గాల జాబితా పెద్దదిగానే ఉంది. గాజువాక, భీమవరంతో పాటు విశాఖ ఉత్తరం, తిరుపతి, కాకినాడ రూరల్ వంటి నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. స్థానిక జనసేన నాయకత్వం నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. కానీ పవన్ వ్యూహాత్మకంగా ఎక్కడ పోటీచేస్తానన్న విషయం బయటపెట్టడం లేదు. ఇటీవల పిఠాపురంలో కార్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇది తెలిసే ముద్రగడ దమ్ముంటే పిఠాపురం నుంచి పోటీచేయాలని పవన్ కు సవాల్ విసిరినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు ముద్రగడ సవాల్ కు పవన్ సమ్మతిస్తే పొలిటికల్ హీట్ పెరిగే అవకాశముంది. అయితే ముద్రగడ ఏ పార్టీ నుంచి బరిలో దిగుతానని మాత్రం చెప్పలేదు. ఆయన వైసీపీ నుంచి పోటీచేస్తే మాత్రం పవన్ గెలుపు నల్లేరు మీద నడకే. ఎందుకంటే మెజార్టీ కాపులు ముద్రగడను ద్వేషిస్తున్నారు. పవన్ ను అభిమానిస్తున్నారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీచేసిన ముద్రగడకు పట్టుమని పదివేల ఓట్లు కూడా రాలేదు. అటువంటి ప్రదర్శన ఉన్న ముద్రగడ కావాలనే పవన్ కు సవాల్ చేశారని తెలుస్తోంది. అయితే సాధారణ ఎన్నికలకు పట్టుమని పది నెలలు కూడా లేదు. అందుకే ముద్రగడ రెండోసారి రాసిన లేఖను సైతం పవన్ లైట్ తీసుకుంటున్నారు. పిఠాపురంలో పోటీ విషయంలో కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.