Nara Lokesh: జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు అపర చాణిక్యుడు అన్న బిరుదు ఉంది. ఎందుకంటే ఆయన ఆజాత శత్రువు. ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోడు. అలాగని శాశ్వత మిత్రత్వం కూడా ఉండదు. రాజకీయ పరిణామాలు బట్టి.. ఏపీలో స్థితిగతులు బట్టి ఆయన తన వైఖరిని మార్చుకుంటూ ఉంటారు. జాతీయస్థాయిలో బిజెపితో పాటు కాంగ్రెస్తో స్నేహం చేశారు. ఆ రెండు పార్టీలకు సమ దూరం పాటిస్తూ కూటములను సైతం ఏర్పాటు చేశారు. ప్రాంతీయ పార్టీలన్నింటితోను ఆయనకు మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. అందుకే నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలు చేయగలిగారు. ఓటమి ఎదురైన ప్రతిసారి గుణపాఠంగా మార్చుకొని విజయాన్ని దక్కించుకున్నారు. అయితే ఇదంతా అనుభవంతోను చంద్రబాబుకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు లోకేష్ చంద్రబాబుకు మించి అన్నట్టు ఈ రాజకీయాలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు సాధిస్తున్నారు.
* రాహుల్ గాంధీకి సూచన..
ఇటీవల ఢిల్లీలో ఓ నేషనల్ మీడియా జరిపిన కాంక్లేవ్ కు లోకేష్ హాజరయ్యారు. రాజకీయ పరిణామాల గురించి తనదైన రీతిలో సమాధానాలు చెప్పారు. తనపై పప్పు అని ముద్రవేశారని.. కానీ పరిణితి సాధించి తనను తాను ప్రూవ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో రాహుల్ గాంధీ తర్వాత తానే ఎక్కువగా ట్రోల్స్ కు గురైన విషయాన్ని సైతం ప్రస్తావించారు. రాహుల్ గాంధీ పాదయాత్రను గుర్తుచేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. తాను సైతం పాదయాత్ర చేసి పడిన ఇబ్బందులను ఒక పుస్తక రూపంలో తెచ్చానని వచ్చారు. రాహుల్ గాంధీ కూడా ఆ ప్రయత్నం చేయాలని సూచించారు. తద్వారా రాహుల్ విషయంలో లోకేష్ సానుకూల ఆలోచన బయటపడింది. అయితే రాహుల్తో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ లోకేష్ నోటి నుంచి ఈ మాటలు రావడం మాత్రం నిజంగా గొప్ప విషయం.
* ప్రధానిని కలిసే చనువు..
నారా లోకేష్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవగలరు. ఆయనతో చర్చించగలరు. లోకేష్ ఫ్యామిలీతో గంటపాటు ప్రధాని నరేంద్ర మోడీ గడిపారు. కలిసి భోజనం చేశారు. అంటే ఏ స్థాయిలో లోకేష్ తన పరిధిని పెంచుకున్నారో అర్థం అవుతుంది. లోకేష్ అఖిలేష్ యాదవ్ తో టచ్ లో ఉన్నారు. విజయ్ తో సన్నిహితంగా ఉన్నారు. డీకే శివకుమార్ తో మాట్లాడగలరు. అచ్చం చంద్రబాబు మాదిరిగానే జాతీయస్థాయిలో తన పరిధిని పెంచుకుంటున్నారు. తాజాగా తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ గురించి ప్రస్తావించారు. పెట్టుబడులతో పాటు పరిశ్రమలను తీసుకురావడంలో ఏపీతో తమిళనాడు పోటీపడిందని.. ఒక్క పారిశ్రామికవేత్త కూడా తమిళనాడులో అవినీతి, డబ్బులు డిమాండ్ చేశారని అనలేదని చెప్పుకొచ్చారు. తమిళనాడు సీఎం విజయ్.. ఆ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో డిఎంకె ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో లోకేష్ చేసిన కామెంట్స్ ను డీఎంకే స్వాగతిస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. అయితే జాతీయస్థాయిలో లోకేష్ వ్యవహారం, చేస్తున్న రాజకీయం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
