Nallari Kiran Kumar Reddy : కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గవర్నర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. చాలా రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ల పదవీకాలం పూర్తయింది. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యంగా మారింది. బిజెపితో పాటు మిత్రపక్షాలకు అవకాశం కల్పించాలని చూస్తోంది కేంద్రం. మంత్రివర్గంలో సీనియర్లకు సైతం గవర్నర్లుగా నియమించాలని భావిస్తోంది. మరోవైపు ఏపీలో టిడిపి నుంచి ఒకరికి.. భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరికి గవర్నర్ పోస్ట్ ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే టిడిపికి చెందిన సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పోస్ట్ ఇచ్చింది కేంద్రం. ప్రస్తుతం ఆయన గోవా గవర్నర్ గా ఉన్నారు. ఇప్పుడు మరో పోస్ట్ ఆ పార్టీకి ఇవ్వడం ఖాయం. ప్రతిభా భారతికి కానీ.. యనమల రామకృష్ణుడు కు కానీ అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఏపీ నుంచి బిజెపి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది.
* కాంగ్రెస్ లోనే సుదీర్ఘకాలం..
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది నల్లారి కుటుంబం. కానీ ప్రస్తుతం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో, ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా గుర్తింపు సాధించారు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీతో విభేదించి సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు కిరణ్ కుమార్ రెడ్డి. అక్కడ నుంచి తిరిగి బిజెపిలోకి వచ్చి మొన్నటి ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురయింది. అయినా సరే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. అయితే ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు గవర్నర్ పోస్ట్ అయితే సరిపోతుందని టాక్ ఉంది.
* సీనియర్లకు ఛాన్స్..
భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు మాజీ ముఖ్యమంత్రి గవర్నర్లుగా నియమితులు అవుతున్నారు. ఆ కోటాలో ఏపీకి చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పట్ల సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పని చేయడం ఒక ఎత్తు అయితే సభాపతిగా ఉండేవారు. చట్టాలపై కూడా మంచి పట్టు ఉంది. శాసనసభ వ్యవహారాలపై అనుభవం ఉంది. ప్రస్తుతానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. కానీ ఆయనకున్న రాజ్యాంగ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని ఏదైనా కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా నియమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.