AP CID: ఏపీ సీఐడీకి చెందిన ఓ కీలక అధికారి కొన్ని పత్రాలు దగ్గరుండి దహనం చేయిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గత నాలుగు సంవత్సరాలుగా విపక్ష నేతలకు ఏపీ సిఐడి ఇబ్బందులు పెట్టింది. సహేతుకమైన కారణాలు లేకపోయినా, తప్పిదాలు జరగకపోయినా అరెస్టుల వరకు దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే. చాలా కేసుల్లో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి మరి అరెస్టుల పర్వం కొనసాగినట్లు విమర్శలు ఉన్నాయి. ఏపీ సిఐడి వైసిపి ప్రభుత్వ జేబు సంస్థగా మారిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏవేవో కేసులను బయటకు తీసి.. అక్రమంగా బనాయించారని కూడా విమర్శలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో సిఐడి కార్యాలయం వద్ద కీలకమైన ధ్రువపత్రాలు దహనం అవుతూ కనిపించడం సంచలనంగా మారుతుంది.
అవినీతి కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజులు పాటు ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సి వచ్చింది. ఒక్క చంద్రబాబునే కాదు లోకేష్ ను అరెస్టు చేస్తారని కూడా ప్రచారం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, మద్యం కేసు.. ఇలా వరుసగా కేసులు నమోదు చేస్తూ వచ్చారు. అదే సమయంలో కొన్ని కేసుల్లో లోకేష్ ను సైతం బాధ్యులను చేశారు. ఒకటి రెండు సార్లు విచారణ కూడా చేపట్టారు. అయితే అప్పట్లో ఈ కేసుల నమోదుకు అవసరమైన ఆధారాలను సేకరించారు. అవన్నీ బోగస్ అని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు వాటికి సంబంధించి పత్రాలు దహనం అవుతూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం సిఐడి ఉన్నతాధికారిగా కొన్ని రఘురామిరెడ్డి ఉన్నారు. ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణ ఉంది. సిఐడి కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్, హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలను ఒక అధికారి దహనం చేస్తుండడం వెలుగులోకి వచ్చింది. నిప్పు రాజేష్ తో అటువైపు ఎవరిని రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా కనిపిస్తోంది. అయితే వీటిని దహనం చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. గతంలో సృష్టించిన నకిలీ ఆధారాలు, నకిలీ పత్రాలను బయటపడకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో గుట్టుగా తగులబెడుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ పత్రాల దహనం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.