Nara Lokesh Kadapa Vision: “విజన్ ఉన్నవాడు ఏదైనా చేస్తాడు. భవిష్యత్తును ముందుగానే ఊహించి అడుగులు వేస్తాడు.. అతడు రావడం ఆలస్యం కావచ్చు. ఒక్కసారి వచ్చాడా మార్పు చూస్తుండగానే మొదలవుతుంది. అది చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. విజన్ లేని వాడు బటన్ నొక్కుతాడు. కేవలం పంచుడు పథకాలు మాత్రమే అమలు చేస్తాడు. సొంత జిల్లాను కూడా పట్టించుకోడు.. అటువంటి వాళ్లకు.. విజన్ ఉన్న వాళ్లకు చాలా తేడా ఉంటుంది..” ఇదిగో ఇలా సాగిపోతున్నాయి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు.
కడప జిల్లాలో విస్తృతమైన వనరులు ఉన్నాయి. వాటన్నిటికీ మించి మానవ వనరులు అధికంగా ఉన్నాయి. చదువుకున్న యువత ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. కానీ వాళ్లకు సరైన అవకాశాలు లేవు. అవకాశాల కోసం పక్కనే ఉన్న బెంగళూరుకు వెళ్ళిపోతున్నారు. ఇంకా కొందరు ముంబై.. హైదరాబాద్ లో స్థిరపడుతున్నారు. పండగలప్పుడు.. ఫంక్షన్లకు మాత్రమే కడప వస్తున్నారు. సొంత ఊరికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు. వస్తున్నప్పుడు ఎంత ఆనందంతో అయితే ఉంటున్నారో.. వెళ్తున్నప్పుడు ఉన్న ఊరు జ్ఞాపకాలను తలుచుకుని బాధతో వెళ్లిపోతున్నారు.
ఇకపై కడప యువతకు అటువంటి బాధ లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కడప రూపురేఖలను పూర్తిగా మార్చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా కడప మీద ఫోకస్ పెట్టారు. కడపలో ఇప్పటివరకు సున్నపు రాళ్లను చెర బట్టి.. దోచుకున్న వాళ్లు.. తరతరాలుగా ఇక్కడ హత్య రాజకీయాలు చేసిన వారు.. మనుషులను కేవలం అవసరాలకు మాత్రమే వాడుకున్నారు. కానీ నారా లోకేష్ మాత్రం మనుషులకు అపర్చునిటీస్ కల్పించడం మొదలు పెట్టారు.
కడప జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా ఆయన ఒక ఆలోచన చేశారు. అది కాస్త ఇప్పుడు ఇక్కడికి యువతకు బలమైన ఆశను కల్పిస్తోంది. అది మరేంటో కాదు స్టార్టప్ కడప. ఈ భవనం పూర్తి కావచ్చింది. “కడపలో యువత సరికొత్త ఆలోచనలకు.. సరికొత్త ఆవిష్కరణలకు ఇది వేదికగా మారబోతోంది. చంద్రబాబు నాయుడు ముందుచూపు.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో కూటమి ప్రభుత్వం కడప ను ఐటి హబ్ గా మార్చుతోందని” కడప ఎమ్మెల్యే మాధవి ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. దానిని నారా లోకేష్ రీ ట్వీట్ చేశారు. అంతేకాదు, హత్యా రాజకీయాలతో ఇన్నాళ్ళ వరకు అట్టుడికి పోయిన కడపను ఎలా మార్చుతామో జస్ట్ రెండు ముక్కల్లో చెప్పేశారు నారా లోకేష్. ఈ ప్రకారం చూసుకుంటే కడప ఇకపై వేరే విధంగా మారబోతోంది. సింపుల్గా చెప్పాలంటే ఐటీ సిటీగా రూపాంతరం చెందబోతోంది. అప్పుడు ఇక్కడ యువత బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేదు. ముంబై వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఉన్న ఊర్లో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతకచ్చు. చుట్టపు చూపుగా రావాల్సిన కర్మ లేదు. చుట్టాల్లోనే కలిసిపోయి దర్జాగా ఉండవచ్చు.
