Vasantha Krishna Prasad: వైసీపీలో అభ్యర్థుల మార్పు ప్రకంపనలు రేగుతూనే ఉన్నాయి. ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీపై దాదాపు తిరుగుబాటు చేసినంత పనిచేశారు. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి తాను ఎన్నికల్లో పోటీ చేయనని హై కమాండ్ కు స్పష్టం చేశారు. ఆయన సీటు మార్చడమే అందుకు కారణం.ప్రస్తుతం కృష్ణ ప్రసాద్ ఎవరికి అందుబాటులో లేరు. దీంతో వైసీపీలో కలవరం రేగుతోంది.
మంత్రి జోగి రమేష్ తో వసంత కృష్ణ ప్రసాద్ కు విభేదాలు ఉన్నాయి. అవి చాలా రోజులుగా కొనసాగుతున్నాయి. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీంతో మొన్న ఆ మధ్యన వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే తాను వైసీపీలో కొనసాగుతానని ఆయన ఖండించారు. ఇప్పుడు అభ్యర్థుల మార్పుతో మరోసారి కృష్ణ ప్రసాద్ అసంతృప్తికి గురయ్యారు. హై కమాండ్ తో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నారు.
ఈసారి మైలవరం సీటును మంత్రి జోగి రమేష్ కు కేటాయించినట్లు తెలుస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ కు మాత్రం జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. హై కమాండ్ పెద్దలకు అందుబాటులో లేకుండా పోయారు. పవన్ పోటీ చేయడానికి సిద్ధంగా లేనని సమాచారం పంపించినట్లు తెలుస్తోంది. కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయనకు సమాచారం పంపించారు. రండి మాట్లాడుకుందాం అంటూ ఆహ్వానించారు. కొంతమంది వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ పెత్తనం ఎక్కువైందని పలుమార్లు కృష్ణ ప్రసాద్ జగన్ కు ఫిర్యాదు చేశారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంతో కృష్ణ ప్రసాద్ కోపంతో రగిలిపోతున్నారు.
మైలవరం నియోజకవర్గ ఇన్చార్జిగా జోగి రమేష్ ఉండేవారు. గత ఎన్నికల్లో ఆయనను పెడనకు పంపించారు. మైలవరం టికెట్ ను వసంత కృష్ణ ప్రసాద్ కు ఇచ్చారు. అయిష్టంగానే పెడన వెళ్లిన జోగి రమేష్ తరచూ మైలవరం నియోజకవర్గంలో జోక్యం చేసుకునేవారు. ఇది వసంత కృష్ణ ప్రసాద్ కు అవమానంగా ఉండేది. దీంతో ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి పరిస్థితి వచ్చింది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ కంటే జోగి రమేష్ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతుండడంతో.. జగన్ కు ఇష్టమైన నేతగా మారారు. అందుకే కృష్ణ ప్రసాద్కు నొప్పిస్తూ మైలవరం టికెట్ ను జోగి రమేష్ కు అప్పగించేందుకు సీఎం జగన్ దాదాపు డిసైడ్ అయ్యారు. ఇస్తే మైలవరం ఇవ్వండి.. జగ్గయ్యపేట నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదని వసంత కృష్ణ ప్రసాద్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.