Jagan Padayatra: వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం అవుతోంది. అయితే ఈ పాదయాత్రతో అధికార పీఠాన్ని అందుకోవాలని గట్టిగానే భావిస్తున్నారు. అయితే గతం మాదిరిగా పాదయాత్ర వర్కౌట్ అవుతుందా? రెండోసారి ఆ ప్రయోగం ఫలిస్తుందా? ప్రజలు నమ్ముతారా? లేకుంటే వైసీపీ శ్రేణులకు ఆనంద పరచడానికి ఈ పాదయాత్ర పరిమితం అవుతుందా? ఇప్పుడు ఇదే బలమైన చర్చ. అయితే ప్రతి సమావేశంలోనూ తన పాదయాత్ర గురించి గొప్పగా ఊహిస్తూ చెబుతున్నారు జగన్. దానిని బట్టి ఆయన పాదయాత్ర పై ఎంతగా ఆశలు పెట్టుకున్నారో అర్థం అవుతోంది. గత పాదయాత్ర మాదిరిగానే అద్భుత విజయాన్ని ఈ పాదయాత్ర కూడా తెచ్చి పెడుతుందని నమ్మకంతో ఉన్నారు జగన్. కానీ గత పాదయాత్ర మాదిరిగా వర్కౌట్ విషయంలో అనేక రకాల అనుమానాలు మాత్రం వెంటాడుతున్నాయి.
* అప్పట్లో పరిస్థితి వేరు..
2014లో 67 స్థానాలతో పటిష్టమైన ప్రతిపక్షంగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమతో పాటు ఎస్సీ, ఎస్టి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ పాగా వేసింది. అప్పట్లో టిడిపి కోస్తాంధ్రతో పాటు ఉభయగోదావరి, ఉత్తరాంధ్రతో వచ్చిన బలంతో అధికారంలోకి రాగలిగింది. అయితే అప్పట్లో అధికార పార్టీకి ధీటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేసింది. సరిగ్గా అదే సమయంలో అంటే 2017 నవంబర్ నుంచి 2019 జనవరి వరకు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా 3648 కిలోమీటర్ల మేర నడిచారు. అప్పట్లో పాదయాత్ర ఒక సంచలనమే. పైగా వన్ చాన్స్ అన్న నినాదంతో.. ప్రశాంత్ కిషోర్ టీం వ్యూహాలతో.. ప్రజల్లో బలమైన సెంటిమెంట్ నింపింది అప్పటి పాదయాత్ర. అయితే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు వేరు.. పథకాల వరకు ఒకే కానీ.. దారి పొడవునా అన్ని వర్గాలకు హామీలు ఇచ్చేశారు జగన్. ఆ హామీల స్థానంలో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలను సంతృప్తి పొందాలని సూచించారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజాగ్రహానికి కారణం కూడా అదే.
* హామీల విస్మరణ..
అయితే దూరమైన వర్గాలను పాదయాత్ర ద్వారా దగ్గర చేసుకోవాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ గతంలో వేలాది కిలోమీటర్లు నడిచిన జగన్ దారి పొడవునా చాలా వర్గాలకు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారు. సంక్షేమ పథకాల్లోనే ఈ హామీలకు పరిష్కార మార్గం చూపినట్లు ఆయన చెప్పుకోచ్చారు కానీ. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం తమ సమస్యలు పరిష్కారం కాలేదని.. కనీస ప్రయత్నం జరగలేదని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు జగన్మోహన్ రెడ్డి పట్ల కొన్ని వర్గాలు ద్వేషం పెంచుకున్నాయి. పైగా 2017లో పాదయాత్ర చేసిన సమయంలో అప్పటి టిడిపి ప్రభుత్వం ఎంతగానో సహకరించింది. ఇప్పుడు ఆ స్థాయిలో సహకారం లభిస్తుందా అనేది అనుమానమే.
* లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు..
లోకేష్ పాదయాత్ర చేసిన సమయంలో అప్పటి అధికార పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో అడ్డగింతలు చేసిందో తెలియంది కాదు. దారి పొడవునా ఇబ్బందులు పెట్టింది. వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగారు లోకేష్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అటువంటి ఇబ్బందులు ఎదురైతే అవి శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ శ్రేణులను కంట్రోల్ చేసే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు. పైగా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జగన్మోహన్ రెడ్డి పై ఉన్న పాత కేసులను తిరగదోడుతారు అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అక్రమాస్తుల కేసుల్లో పుష్కర కాలానికి పైగా బెయిల్ పై ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ కేసులు తెరపైకి వస్తే మాత్రం ఆ ప్రభావం పాదయాత్ర పై ఉంటుంది. పైగా ఈసారి పాదయాత్ర 5000 కిలోమీటర్లు పైగా చేయాలని భావిస్తున్నారు జగన్. దీనికి గాను ఎక్కువ షెడ్యూల్ కేటాయించాలని చూస్తున్నారు. ఒకవేళ పాత కేసులు తెరపైకి వచ్చి అరెస్టుల పర్వం నడిస్తే మాత్రం.. అది అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే. అందుకే పాదయాత్ర పై అనేక అనుమానాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..