KNR Assets Controversy: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేఎన్ఆర్ హాట్ టాపిక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈయన పిఏ. సాక్షి మీడియాలో సాధారణ ఉద్యోగిగా ఉండేవారు. నెలకు 12 వేల రూపాయల జీతం తీసుకునేవారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి కుటుంబ సభ్యులు టిఫిన్ దుకాణాన్ని కూడా నడిపేవారు. అటువంటి కేఎన్ఆర్ జగన్ మోహన్ రెడ్డి పీఏ గా ఉంటూ వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. వందలాది ఎకరాలతో పాటు విలువైన స్థలాలు, విల్లాలు, కమర్షియల్ బిల్డింగ్స్ ఇలా అన్నింటిని సంపాదించారు కేఎన్ఆర్. ఇప్పుడు ఆయన వందలాది కోట్ల రూపాయల ఆస్తుల చిట్టా బయటకు రావడంతో.. అది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా సంపాదించిందా? లేకుంటే ఆయన బినామీగా ఈయన ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
* ఒక వెలుగు వెలిగిన వైనం..
జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ పీఏ గా ఉండే కేఎన్ఆర్ ఉండక తప్పదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయితే ఒక వెలుగు వెలిగారు. చివరకు ఐఏఎస్ ల బదిలీల్లో కూడా కేఎన్ఆర్ మాట చెల్లుబాటు అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో రాజశేఖర్ రెడ్డికి సూరీడు మాదిరిగా జగన్మోహన్ రెడ్డికి కేఎన్ఆర్ ఉండేవారు. అప్పట్లో సూరీడు చుట్టూ పెద్ద పెద్ద వారు తిరిగేవారు. ఆయనే రాజశేఖర్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించేవారు. అప్పట్లో భారీగా సూరీడు డబ్బులు సంపాదించాడన్న ఆరోపణ ఉంది. పెద్ద ఎత్తున ఆస్తులు పోగెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో సూరీడు తన ప్రభావాన్ని కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు రానీయలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి.
* భారీగా ఆస్తులు..
అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఎ కెఎన్ఆర్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఏసీబీ. తవ్వే కొద్ది ఆస్తులు అన్నట్లు ఆయన పేరుతో పాటు కుటుంబ సభ్యులకు చాలా ఆస్తులు బయటపడుతున్నాయి. విశాఖ, విజయవాడ, అమరావతి లో వందలాది ఎకరాలు బయటపడ్డాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా సంపాదించినవా? బినామీ పర్వంలో ఉండేవా? అన్నది తెలియాల్సి ఉంది. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆయన సంపాదించి ఉంటే మాత్రం వైసిపి నుంచి కూడా ఎదురుదాడి ఉండడం ఖాయం. కేసుల పరంగా కూడా పట్టు బిగుస్తుంది. బినామీ పర్వం అయితే మాత్రం అధికార కూటమికి ఒక అస్త్రంగా మారుతుంది.
