Jagan Mohan Reddy Hyderabad: రాష్ట్ర విభజన జరిగింది. కొత్తగా తెలంగాణ( Telangana) ఏర్పాటు అయింది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయితే ఇది జరిగి పుష్కరకాలం అవుతోంది. ఉభయ రాష్ట్రాల ప్రజలు సెంటిమెంట్ అనే అంశాన్ని వదిలి చాలా ప్రశాంతంగా ఉన్నారు. ప్రభుత్వాలు సైతం సహృద్భావ వాతావరణంతో నడుస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఇప్పుడు హైదరాబాదులో హడావిడి ప్రారంభం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు. దీంతో అక్కడ పోలీసులు అప్రమత్తం అయ్యారు. జగన్ వెళ్తున్న మార్గంలో భారీగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. అయితే ఉన్నఫలంగా ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వెనుక జగన్ పర్యటన ఉందని తెలుసుకొని తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే జగన్ కోర్టు పర్యటనకు కూడా జన సమీకరణ చేస్తున్నట్లు అర్థం అవుతోంది.
Also Read: బయటకు వెళ్లొచ్చు.. ఆ ఇద్దరు నేతలకు జగన్ షాక్!
పుష్కరకాలంగా బెయిల్ పై..
గత పుష్కర కాలంగా బెయిల్ పై బయట ఉన్నారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). 2012లో ఆయన 11 అక్రమ ఆస్తుల కేసుల్లో అరెస్టయ్యారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపి 2013 సెప్టెంబర్ లో బెయిల్ పై విడుదలయ్యారు. ఆ సమయంలో కోర్టు షరతులు విధించింది. ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చి సంతకం పెట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. అది మొదలు 2019 మార్చి వరకు అలానే కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్రలో ఉన్న సమయంలో సైతం గురువారం సాయంత్రం ముగించి శుక్రవారం వచ్చి సంతకం చేసి వెళ్లేవారు. ఆ సమయంలో ఎటువంటి హడావిడి ఉండేది కాదు. జగన్ ఎప్పుడు హాజరై.. ఎప్పుడు వెళ్ళిపోయారు తెలియని పరిస్థితి ఉండేది అప్పుడు.
ఇటీవల విదేశీ పర్యటన..
అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో సహా ఐరోపా( Europe) పర్యటనకు వెళ్లారు. అక్రమాస్తుల కేసుల్లో నిందితుడు కాబట్టి కోర్టు అనుమతి తప్పనిసరి. అయితే విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కోరింది. కానీ కోర్టు మాత్రం అనుమతి ఇచ్చింది. అయితే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించింది. అయితే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అయితే విదేశాల నుంచి వచ్చిన తర్వాత మాత్రం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతగా కోర్టుకు హాజరు కావాల్సిన విషయంలో తనకు మినహాయింపు కావాలని కోరారు. అందుకు ఆయన చూపిన కారణం తాను హాజరైతే ప్రోటోకాల్ ప్రకారం, భద్రతా చర్యల దృష్ట్యా ఇబ్బందికరమని కోర్టుకు తెలిపారు. అయితే ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆపై ప్రతిపక్ష హోదా లేదు. దీంతో కోర్టు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాదు రానున్నారు. రేపు కోర్టుకు హాజరవుతారు.
Also Read: జగన్ వస్తే జనం ఉండాల్సిందేనా?
జనం రావడం ఖాయం..
అయితే తాజాగా తెలంగాణ పోలీసులు( Telangana police department) హైదరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. అందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటనను సాకుగా చూపారు. ఆయన వెళ్లే రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి కూడా కావాల్సింది అదే. జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం ఉండడం సహజం. ఆయన విదేశీ పర్యటనల్లో సైతం జనం ఎక్కువగా కనిపిస్తారు. ఇప్పుడు కూడా జన సమీకరణ జరుగుతోంది. తప్పకుండా ఆ పర్యటనను హైలైట్ చేస్తారు. దీనినే కోర్టుకు నివేదించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతారు. జగన్ పర్యటన నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న ఒక సామాజిక వర్గం వారు తప్పకుండా భారీ ఏర్పాట్లు చేస్తారు. అయితే న్యాయవ్యవస్థ లోతుగా ఆలోచన చేస్తే వ్యక్తిగత హాజరుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడాలి. లేకుంటే శాంతిభద్రతల కోణంలో.. ట్రాఫిక్ ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటే మాత్రం జైలుకు వ్యక్తిగత హాజరు విషయంలో మినహాయింపు ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.