Jagan
Jagan: తాను చేస్తే లోక కళ్యాణం.. ఎదుటివారు చేసింది వ్యభిచారం అన్నట్టు ఉంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లతో అధికారం ఇచ్చారు. అది ప్రజా తీర్పు అట. ప్రజలు ఏరి కోరి తమను గెలిపించారట. ఇప్పుడు అదే ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు జగన్ ను. జగన్ వ్యతిరేకులకు 164 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం తనకు ఎదురైంది ఓటమి కాదట. ఈవీఎంల ట్యాంపరింగ్ అట. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఇదే జగన్ ఎన్నికల వ్యవస్థ గురించి, ఈవీఎంల పనితీరు గురించి స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల తర్వాత ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ సంచలన ట్విట్ చేశారు. అటు వైసీపీ నేతలు సైతం ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా కొత్త ప్రచారానికి తెర తీశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. అప్పుడు కూడా ఆయన జగన్ మాదిరిగా చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో తనకే ఓట్లు పడ్డాయని.. కానీ గోల్మాల్ జరిగిందని అమెరికా ఎన్నికల వ్యవస్థనే ప్రశ్నించినంత పని చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫలితాలను ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని తాను అంగీకరించినని కూడా పెద్ద వివాదమే సృష్టించారు. రోడ్లపైకి వచ్చి ట్రంప్ మద్దతుదారులు పెద్ద గలాటా సృష్టించారు.ఇప్పుడు జగన్ అండ్ కో మాటలు సైతం అలానే ఉన్నాయి. ఏకంగా ప్రెస్ మీట్ లు పెట్టి భారత ఎన్నికల వ్యవస్థ పై కొందరు మాట్లాడుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరికొందరు తప్పు పడుతున్నారు. కేవలం ఓటమిని అంగీకరించక.. ఈవీఎంల ట్యాంపరింగ్ తో చంద్రబాబు గెలిచినట్లు ప్రజల్లోకి ఒక సంకేతాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల జగన్ ఒక ట్విట్ చేశారు.’ న్యాయం జరగడమే కాదు. జరిగినట్లు కనిపించాలి’ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం బలంగా ఉన్నట్లు కనిపించాలని హితోక్తులు వల్లె వేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెట్ వాడుతున్నారని ట్విట్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేలా మనము ఆ దిశగా పయనించాలని రాసుకొచ్చారు. ఐదేళ్ల కిందట ఈవీఎంలు, వివి ప్యాట్లు, అందులో వచ్చే స్లిప్పులు, వాటిపై కనిపించే గుర్తులు అంటూ గొప్ప గొప్ప సూక్తులు చెప్పారు జగన్. కానీ ఇప్పుడు మాట మార్చారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అపజయం పాలయ్యారు. ఈ దారుణమైన పరాధవంతో నిస్తేజమైన వైసీపీ శ్రేణులను ఎలా సర్ది చెప్పాలో తెలియక ఈవీఎంలపై పడ్డారు. ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలను ప్రజల్లోకి పంపే ప్రయత్నాలు చేశారు. కేవలం గెలిస్తే తప్ప.. ఈవీఎంలను ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఎక్కువ మంది ఆంధ్రా డోనాల్డ్ ట్రంప్ అంటూ జగన్ ను వ్యాఖ్యానిస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Jagan made a sensational tweet expressing doubts about the performance of evms
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com