AP Grama Sachivalayam : వైసీపీ హయాంలో పంచాయితీ వ్యవస్థ నిర్వీర్యం అయిందన్న విమర్శ ఉంది. సచివాలయ వ్యవస్థతో పంచాయితీలు దెబ్బతిన్నాయి. దీనిపై వైసీపీ సర్పంచులే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత పంచాయితీలను పట్టించుకున్న వారు కరువయ్యారు. సచివాలయ నిర్వహణ బాధ్యతలను పంచాయతీలపై పెట్టారు. కానీ వాటిపై ఎటువంటి హక్కులు కల్పించలేదు. దీనిపై సర్పంచులు సైతంఆవేదనతో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయితీలకు పూర్వ వైభవం తేవాలని భావిస్తోంది. అందుకే సచివాలయాల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. సచివాలయాల నిర్వహణ, ఉద్యోగుల బాధ్యతలపై అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సచివాలయాల వ్యవస్థ నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్ది.. అవసరం మేరకు ఉద్యోగులను సర్దుబాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో పంచాయితీలతో సచివాలయాలను అనుసంధానం చేస్తూ.. ప్రతి పంచాయతీకి ఒక సచివాలయాన్ని మాత్రమే కొనసాగించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. అయితే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పల్లె ముంగిటకు పాలన తెచ్చామని అప్పటి వైసిపి ప్రభుత్వం ఆర్భాటం చేసింది. అయితే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయన్న విమర్శ కూడా ఉంది. అదే సమయంలో సచివాలయాల నిర్వహణ భారంగా కూడా మారింది. అక్కడ పనిచేసే ఉద్యోగుల పర్యవేక్షణ పై కూడా అనేక రకాల అపవాదులు ఉన్నాయి.
* ఎన్నికల ముందు ప్రచారం
ఎన్నికలకు ముందు చంద్రబాబు అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను ఎత్తివేస్తారని వైసిపి ప్రచారం చేసింది. అయితే తాము అధికారంలోకి వస్తే సచివాలయ వ్యవస్థను కొనసాగించడంతోపాటు వాలంటీర్లకు 10,000 చొప్పున వేతనాలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తూనే.. పంచాయితీలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 11 రకాల ఉద్యోగులు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు.
* సర్పంచులకు అధికారాలు
సచివాలయాలపై సర్పంచులకు కొన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయితీకి ఒక సచివాలయం ఉండేలా ప్లాన్ చేస్తోంది. కొన్ని పంచాయితీల్లో ఒకటికి మించి సచివాలయాలు ఉన్నాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న 11 శాఖల కార్యదర్శులకు పని లేకుండా పోయింది. దీనికి తోడు వారిపై పర్యవేక్షణ ఒక శాఖ చేస్తుండగా.. పనులు మాత్రం ఇంకో శాఖ చేయించుకుంటుంది. అటువంటి సమస్య లేకుండా ఉద్యోగుల సర్దుబాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామంలో జనాభాను యూనిట్ గా తీసుకొని సచివాలయాలను కొనసాగించనుంది. రేపు మంత్రివర్గ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More