Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: కడపలో షర్మిల గెలుపు కోసం డమ్మీ అభ్యర్థి.. బీజేపీతో పొత్తు.. కాంగ్రెస్ కు...

YS Sharmila: కడపలో షర్మిల గెలుపు కోసం డమ్మీ అభ్యర్థి.. బీజేపీతో పొత్తు.. కాంగ్రెస్ కు మద్దతా చంద్రబాబూ?

YS Sharmila: కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారా? కడపలో షర్మిలను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అందులో భాగంగానే అక్కడ భూపేష్ రెడ్డిని బరిలోదించారా? ఇదంతా ముందస్తు ప్లాన్ యేనా? ఏకకాలంలో బిజెపితో పాటు కాంగ్రెస్ తో పొత్తు కొనసాగిస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత నెలలో ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. చిలకలూరిపేట ఉమ్మడి సభలో ఎన్డీఏ ఓట్లు చీల్చేందుకే షర్మిల ప్రయత్నిస్తున్నారని.. అన్నా చెల్లెలు కలిసి నాటకం ఆడుతున్నారంటూ షర్మిల, జగన్ పై ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే షర్మిల కోసం చంద్రబాబు డమ్మీ అభ్యర్థిని బరిలో దించారని ప్రచారం జరుగుతుండడం విశేషం.

తెలంగాణ రాజకీయాల నుంచి షర్మిల ఏపీ వైపు రావడమే ఒక సంచలనం. దీని వెనుక చంద్రబాబు ఉన్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఆమెకు పిసిసి పగ్గాలు అప్పగించడం వెనుక కూడా చంద్రబాబు లాబీయింగ్ పనిచేసినట్లు టాక్ నడిచింది. రేవంత్ రెడ్డి ని రంగంలోకి దించి షర్మిలను ఏపీ పగ్గాలు అప్పగించి.. జగన్ ను కంటిమీద కునుకు లేకుండా చేయాలని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. కేవలం పిసిసి పగ్గాలే కాదు..కడప పార్లమెంట్ స్థానం నుంచి షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ బలమైన అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. కానీ జమ్మలమడుగు నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించి..ఆ నియోజకవర్గానికి ఆదినారాయణ రెడ్డిని పరిమితం చేశారు. అప్పటివరకు అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్న భూపేష్ రెడ్డిని తెచ్చి.. కడప పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇదంతా షర్మిల కోసమేనని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో స్క్రోలింగ్ వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దానినే సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.

బిజెపితో టిడిపి పొత్తు అవసరాల మేరకే అన్నది అందరికీ తెలుసు. అయితే సిద్ధాంతపరంగా బిజెపి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ పార్టీతో అంటగాకిన వారికి దూరం పెడుతుంది. అందుకే గత ఐదు సంవత్సరాలుగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన చంద్రబాబును పెద్దగా పట్టించుకోలేదు. కానీ చివరకు చంద్రబాబు ప్రయత్నాలను బిజెపి పెద్దలు పట్టించుకోవాల్సి వచ్చింది. అయితే చంద్రబాబు తన దుర్బుద్ధిని చూపించుకున్నారని.. ఒకవైపు బిజెపితో పొత్తు కొనసాగిస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గెలుపు కోసం డమ్మీ అభ్యర్థిని బరిలో దించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్న విమర్శలు చేసిన కొద్దిసేపటికి ఈ తరహా ప్రచారం జరగడం విశేషం. కెసిఆర్ చెప్పినట్టు చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ మరొకరు ఉండరని క్యాప్షన్ ఇస్తూ వైసిపి సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే ఇది ఫేక్ అని.. ఏబీఎన్ లోగో తో ఫేక్ స్క్రోలింగ్ సృష్టించి ప్రచారం చేస్తున్నారని టిడిపి వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని.. ఏపీలో పొత్తు ధర్మాన్ని చెడగొట్టేందుకు వైసిపి ఈ తరహా ప్రయత్నాలు చేస్తోందని టిడిపి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular