Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: ఆ నేతలకు టిక్కెట్లు లేనట్టే.. చంద్రబాబు ఫిక్స్

Chandrababu: ఆ నేతలకు టిక్కెట్లు లేనట్టే.. చంద్రబాబు ఫిక్స్

Chandrababu: మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయో లేదోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బిజెపి సైతం కలిసి వస్తుందని ఈ రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ.. దాదాపు 50 స్థానాల వరకు వదులుకోవాల్సి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోతమకు సీటు దక్కుతుందా? లేదా? అని టిడిపి నాయకులు ఆందోళనతో ఉన్నారు.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది. 152 స్థానాల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది అభ్యర్థులు నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. ఈసారి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ పొత్తులో భాగంగా తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయం వారిని వెంటాడుతుంది. విశాఖ, ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో చాలామంది టిడిపి నేతలు అభద్రతాభావంతో ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా కొందరికి సంకేతాలు రావడంతో వారిలో ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో సీనియర్లు కాస్త భయంతోనే ఉన్నారు. ఒక్కసారి నియోజకవర్గంపై పట్టు కోల్పోతే.. దశాబ్దాల రాజకీయ ఆధిపత్యానికి తెరపడినట్టే.

గత ఎన్నికల అనంతరం 23 మందిలో… ఐదుగురు ఎమ్మెల్యేలు చేజారి పోయారు. ఉన్నది 18 మందే. సిట్టింగులకు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఇదివరకే చంద్రబాబు ప్రకటించారు.దీంతో వారందరికీ సీట్లు ఖాయమని భావించారు. కానీ పొత్తుల పుణ్యమా అని సిట్టింగ్ స్థానాల్లో సైతం కొన్నింటిని జనసేనకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉన్నాయి. అటువంటి నాయకులకు సైతం సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బిజెపి కలిసి వస్తే.. కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అవి కూడా అర్బన్ నియోజకవర్గాలనేఅప్పగించాల్సి ఉంటుంది. అయితే బిజెపికి వీలైనంత వరకు ఎంపీ స్థానాలు ఇచ్చి.. అసెంబ్లీ స్థానాలను మాత్రం తన వద్ద ఉంచుకునేందుకు టిడిపి ప్రయత్నిస్తుందన్న ప్రచారం ఉంది.

ఇటువంటి తరుణంలో చంద్రబాబు తాజాగా చేసిన ప్రకటన పార్టీ నేతల్లో ప్రకంపనలు రేపుతోంది. పార్టీలో పని చేసిన వారికే సీట్లు అని చంద్రబాబు తెగేసి చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు. పనిచేయని నేతలను పక్కన పెడతామని కూడా హెచ్చరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేయని నేతల జాబితా చంద్రబాబు వద్ద ఉందని.. ఆ ప్రభావం టికెట్ల కేటాయింపులో ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని.. ఎటువంటి అనుమానాలకు తావు లేదని చంద్రబాబు ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. పొత్తుల్లో భాగంగా పార్టీ శ్రేణులను చంద్రబాబు అప్రమత్తం చేశారని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular