కరోనాకు ఇప్పటి వరకు మందులేదు. దీంతో.. అందరికీ ఇప్పుడు కావాల్సింది వ్యాక్సినే. కానీ.. ఇటు చూస్తే వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. భారత్ భయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న రెండు వ్యాక్సిన్లు డిమాండ్ కు తగినట్టుగా సప్లై కావట్లేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ‘స్పుత్నిక్-వి’ టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అది నామమాత్రమే.
ఇక, ఫైజర్, మోడెర్నా టీకాల కోసం ప్రయత్నించినప్పటికీ.. కావాల్సినంత అందుబాటులో లేదు. ఈ ఏడాది 5 కోట్ల డోసులను సరఫరా చేయగలమని ఫైజర్ ప్రకటించగా.. వచ్చే ఏడాది ఇవ్వగలమని మోడెర్నా తెలిపింది. దీంతో.. వ్యాక్సినేషన్ నెమ్మదిగానే సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ కు తరలుతోందని, ఎక్కువ డబ్బులు చెల్లించిన వారికే అందుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా.. ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ లోని మూడునాలుగు బడా హోటల్స్ వినూత్నమైన ఆఫర్ ను ప్రకటించినట్టు సమాచారం. అదేమంటే.. తమ హోటల్ కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్న వారికి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినట్టు తెలుస్తోంది.
వారి హోటల్ కు వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్లిన వారికి ఓ రూమ్ ఇస్తారట. ఎయిర్ కండీషన్ నుంచి లగ్జరీగా అందాల్సిన అసౌకర్యాలన్నీ అందిస్తారట. ఉదయం వెళ్తే బ్రేక్ ఫాస్ట్.. మధ్యాహ్నం వెళ్తే లంచ్ కూడా ఆఫర్ చేస్తారట. ఆ తర్వాత ప్రశాంతంగా వ్యాక్సిన్ ఇచ్చి పంపిస్తారట. ఇందుకుగానూ రూ.10 వేల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.
డబ్బున్నవాళ్లకు పది వేలు పెద్ద లెక్క కాదు. అలాంటి వారంతా.. క్యూ లైన్లోకి వెళ్లి అవస్థలు పడడం ఎందుకని హోటల్ కు వెళ్లి పదివేలు పడేసి టీకా తీసుకోవచ్చు. అయితే.. హోటళ్లకు వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న వస్తోంది. ఇలా చేయడమంటే.. బ్లాక్ మార్కెట్ కు తరలించినట్టే కదా? అని నిలదీస్తున్నారు చాలా మంది. ఈ ఆఫర్లతో హోటళ్లు లాభపడుతుండగా.. డబ్బు సమస్య లేనివాళ్లు ఈజీగా వ్యాక్సిన్ పొందుతున్నట్టు లెక్క. అంటే.. మధ్యలో వ్యాక్సిన్ అందుకోలేని దౌర్భాగ్యులం తామేనా? అని నిరుపేదలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, దీనికి అధికారులు ఏం సమాధానం చెబుతారనే ప్రశ్న తలెత్తుతోంది.