AP Panchayats: ఏపీకి( Andhra Pradesh) గుడ్ న్యూస్. 16వ ఆర్థిక సంఘం నిధులు భారీగా సమకూరనున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దానికంటే అదనంగా సమకూరనున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఆర్థిక సంఘం నిధులను కేంద్రం సర్దుబాటు చేస్తూ వస్తుంది. 2021 నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రాక ప్రారంభం అయింది. ఈ ఏడాది మార్చి 31 తో 15వ ఆర్థిక సంఘం నిధులు ముగియనున్నాయి. 16వ ఆర్థిక సంఘం నిధులు ప్రారంభం కానున్నాయి. అయితే 15వ ఆర్థిక సంఘం కంటే 16వ ఆర్థిక సంఘం ద్వారా ఏపీకి అదనంగా నిధులు సమకూరనుండటం విశేషం. ఈ ఐదేళ్లలో 15వ ఆర్థిక సంఘం కింద రూ.10,230 కేటాయించారు. కానీ ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం కింద కేంద్ర బడ్జెట్లో తాజాగా రూ. 16,627 కోట్లు కేటాయించారు. అంటే అదనంగా రూ.6397 కోట్లు అన్నమాట. ఏపీలో స్థానిక సంస్థలకు ఇది శుభ పరిణామం.
* బదలాయింపు..
వైసిపి( YSR Congress party ) ఐదేళ్ల కాలంలో స్థానిక సంస్థలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులు.. ఇతర శాఖలకు బదలాయించేవారు. సంక్షేమ పథకాలకు మళ్లించారు. గ్రామాల్లో ఉండే జనాభా, వారి సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు గాను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తూ వస్తోంది. 2019 వరకు వీటి ఖర్చు సజావుగా సాగుతూ వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంఘం నిధుల ఖర్చు తీరు మారింది. రకరకాల పద్దుల పేరుతో ఆర్థిక సంఘం నిధులను మళ్ళించారు. దీంతో స్థానిక సంస్థలకు ఎటువంటి నిధుల కేటాయింపు జరగకుండా పోయింది. దీంతో చిన్నచిన్న పంచాయితీల నిర్వహణ కూడా కష్టతరంగా మారింది.
* నిధుల మల్లింపునకు కళ్లెం..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంఘం నిధుల మళ్లింపునకు కళ్లెం పడింది. ఆర్థిక సంఘం నిధులు పంచాయితీల విద్యుత్ చార్జీలు, ఇతరత్రా అవసరాలకు మళ్లించకుండా కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan )ప్రత్యేకంగా చొరవ చూపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థల వేనని తేల్చి చెప్పారు. గడిచిన 18 నెలల కాలంలో పంచాయితీలకు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటితోనే గ్రామాలను అభివృద్ధి చేశారు. వైసిపి హయాంలో మంజూరైన ఆర్థిక సంఘం నిధులు 3000 కోట్ల రూపాయలను విద్యుత్ చార్జీల రూపంలో బదలాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
* నిధుల దుర్వినియోగం పై ఫోకస్..
నిధుల దుర్వినియోగం పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. తద్వారా వెయ్యికోట్లకు పైగా నిధులు పంచాయితీల ఖాతాల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రాధాన్య అంశాల మేరకు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అనవసరవ్యయానికి కళ్లెం పడింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే 16వ ఆర్థిక సంఘం నిధుల్లో అధిక శాతం పంచాయతీలకు కేటాయించనున్నారు. దాదాపు 70 శాతం పంచాయితీలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ రూ.16,627 కోట్లలో పంచాయితీలకు రూ.11,639 కోట్లు పంచాయతీలకు కేటాయించనున్నారు అన్నమాట. మిగతా నిధులు మాత్రం మండల పరిషత్, జిల్లా పరిషత్తులకు కేటాయించనున్నారు.