Polavaram Left Main Canal: ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు సీమకు కృష్ణమ్మ నీటిని తరలించింది. ఇప్పుడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించే శుభముహూర్తానికి రంగం సిద్ధం అయ్యింది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఎదురుచూపులకు మోక్షం కలగనుంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూముల్లోకి పారేందుకు సమయం ఆసన్నమైంది. రేపు సీఎం చంద్రబాబు రెగ్యులేటర్ ఆన్ చేసి.. గోదావరి జలాలకు జల హారతి ఇవ్వనున్నారు. ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చనున్నారు.
* కూటమి వచ్చిన తర్వాత..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగాయి. మరోవైపు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఉత్తరాంధ్ర వైపు విస్తరిస్తూ అనకాపల్లి జిల్లాకు తాకింది. రూ.4192 కోట్ల భారీ ఖర్చుతో 213 కిలోమీటర్ల మేర పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. దారి పొడవునా ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి అనేక నదులు, వాగులు దాటుకుంటూ ఈ కాలువ సాగనుంది. ఇంజనీరింగ్ అద్భుతాలకు ప్రతీకగా కొన్నిచోట్ల నదీ ప్రవాహానికి ఎగువ నుంచి అక్విడెక్టులు, మరికొన్ని చోట్ల దిగువ నుంచి సైపన్లు నిర్మించారు. ముఖ్యంగా పంపానదిపై 30 కిలోమీటర్ల లోతులో 312 పైల్స్ తో అక్విడిక్ట్, తాండవ నదిపై 10,634 క్యూసెక్కుల ప్రవాహ సామర్ధ్యాన్ని తట్టుకునేలా.. 447 మీటర్ల పొడవున భారీ నిర్మాణాలు పూర్తి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తాళ్లపాలెం భూ వివాదాన్ని పరిష్కరించి 472 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. తక్షణంగా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
* వరుసగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం..
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ప్రకాశం తో పాటు రాయలసీమకు సాగునీరు అందించి అక్కడి ప్రజల్లో సంతృప్తి నింపింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి అక్కడి ప్రజల్లో ఒక రకమైన సంతృప్తికి కారణం అవుతుంది. కచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మరోవైపు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. రెండేళ్లలో పనులు జరిపి ఒక్కో ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. జాతికి అంకితం చేస్తున్నారు. నిజంగా ఇది గొప్ప పరిణామం. కాగా మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని ఈ ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా జరుపనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.