Swiggi Survices : ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ సేవలు నిలిచిపోనున్నాయి. దానిని బహిష్కరిస్తూ హోటల్లో అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఆ సంస్థతో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ప్రజలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి హోటల్స్ కూ, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్ కు మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, ఎక్కువ కమిషన్ డిమాండ్ చేయడం వంటి కారణాలతో స్విగ్గీతో పాటు జొమోటా పైన హోటల్లు అసంతృప్తిగా ఉన్నాయి. తమను ఆధారంగా చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్న ఆ సంస్థలు తిరిగి ఇబ్బంది పెట్టడంపై ఆగ్రహంతో ఉన్నారు హోటల్ యజమానులు. ఈ నేపథ్యంలోనే హోటల్ యాజమాన్యాలు స్విగ్గీకి ఈనెల 14 వరకు డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఈలోపు తమ షరతులకు అంగీకరించకపోతే బహిష్కరించడం ఖాయమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి.
* అప్పట్లో తెలంగాణలో నిషేధం
కరోనా కాలంలో తెలంగాణ ప్రభుత్వం స్విగ్గీపై నిషేధం విధించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కానీ అప్పట్లో సీఎం జగన్ మాత్రం ఏపీలో ఆ సంస్థకు అనుమతి ఇచ్చారు. కరోనాకాలంలో ఏపీలో కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఈసంస్థకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు మాత్రం దాని తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
* మూడుసార్లు చర్చలు
అయితే ఇప్పటికే హోటల్లో యాజమాన్యాలు ఆగస్టులో స్విగ్గీ ప్రతినిధులతో మూడుసార్లు చర్చలు జరిపాయి. తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే జొమాటో మాత్రం అంగీకారం తెలిపింది. స్విగ్గీ మాత్రం ఒప్పుకోలేదు. అందుకే స్విగ్గీ పై హోటల్ యాజమాన్యాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో బహిష్కరించాలని చూస్తున్నాయి. ఈనెల 14న దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More