MVV Satyanarayana
MVV Satyanarayana: వైసీపీకి విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గుడ్ బై చెబుతారా? ఆయన పార్టీని వీడడం ఖాయమా? అందుకే వైసిపి కార్యక్రమాల్లో కనిపించడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఈ మాజీ ఎంపీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. విశాఖలో ఏకకాలంలో ఆయనకు సంబంధించిన నివాసాల్లో తనిఖీలు ప్రారంభించింది. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. 2019 ఎన్నికలకు ముందు వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. జగన్ పాదయాత్రలో ఉండగా అనూహ్యంగా పార్టీలో చేరారు. దీంతో విశాఖ ఎంపీ సీటును ఎంవివికి ఇచ్చారు జగన్. టిడిపి అభ్యర్థిగా శ్రీ భరత్ పోటీ చేశారు. కానీ కేవలం 3 వేల ఓట్ల మెజారిటీతో ఎంవీవీ విజయం సాధించారు. అయితే గత ఐదేళ్లుగాఈ నేతపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి పైనే అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై హై కమాండ్ సైతం సీరియస్ యాక్షన్ కు దిగింది. ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఫిర్యాదుతోనే జగన్ విజయసాయిరెడ్డిని తప్పించారని అప్పట్లో ప్రచారం సాగింది. ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా నియమితులు కావడంతో.. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఎంవివి సత్యనారాయణ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
* రియల్ ఎస్టేట్ రంగం నుంచి
రియల్ ఎస్టేట్ రంగంలో రాణించారు ఎం వి వి సత్యనారాయణ. తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎంపీగా గెలిచారు. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో విశాఖలో దందాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కిడ్నాప్నకు కూడా గురయ్యారు. అయితే ఓ అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబ సభ్యులు అప్పట్లో కిడ్నాప్ కావడం విమర్శలకు తావిచ్చింది. అయినా సరే జగన్ ఆయనకు అవకాశం ఇచ్చారు. విశాఖ తూర్పు అసెంబ్లీ సీట్లు ఇచ్చి ప్రోత్సహించారు. అయినా సరే ఆయనకు ఓటమి తప్పలేదు. భారీ ఓట్లతో ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదు. అయితే ఆయన సైలెంట్ వెనుక పార్టీ మారుతారు అన్న ప్రచారం జరిగింది. కానీ కొద్దిరోజులుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఎం వి వి సత్యనారాయణ.
* ఏకకాలంలో ఈడీ దాడులు
అయితే తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విశాఖలో తన కార్యాలయం తో పాటు సన్నిహితుల ఇళ్లపై అధికారులు దాడి చేసి తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఈ మాజీ ఎంపీ ఎంవీవీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీలో చేరుతానని ఎం వివి సత్యనారాయణ వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. అయితే గత ఐదేళ్లుగా ఎంపీ ఎంవీవీ తీరుతో టిడిపి శ్రేణులు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఆయన పార్టీలో చేరికను వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఉన్నత స్థాయిలో ఆయన పెద్ద ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ed raids on former ycp visakha mp mvv satyanarayana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com