Bill Gates AP Tour: ప్రపంచవ్యాప్తంగా బిల్ గేట్స్( Bill Gates ) అపాయింట్మెంట్ కోసం వివిధ దేశాల పాలకులు ఎదురుచూస్తుంటారు. అంతటి ప్రముఖ వ్యక్తి అమరావతికి వచ్చారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ పెద్దలను కలిశారు. దీనిని ఏపీ ప్రజలు గర్వపడుతున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. చంద్రబాబును పొగిడితే భరించలేకపోతోంది. చంద్రబాబు స్వయంగా ఆయనకు తమ ప్రభుత్వం ఈ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ టెక్నాలజీ వంటి వాటి గురించి వివరించారు. ఎప్పటికప్పుడు అంది వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును బిల్ గేట్స్ ప్రశంసించారు.
* అదేపనిగా విషం
అయితే వైసిపి( YSR Congress party ) కుహనా మేధావులు, ఆ పార్టీ ప్రోత్సాహక జర్నలిస్టులు అదే పనిగా విషం చిమ్మడం మొదలుపెట్టారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ప్రెస్ మీట్ పెట్టి.. బిల్ గేట్స్ కి టీలు, కాఫీలు, సమోసాలు, కార్లు, హోటల్, ఫ్లైట్ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చులు పెట్టిందో లెక్కలు బయటపెట్టాలి. అసలు ఆయన దేనికి వచ్చాడు? రాష్ట్రానికి ఏం తెచ్చాడు? ఏమి ఇచ్చాడు? ఆయన మీద ఎంత ఖర్చు పెట్టారు? అన్నది చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే ఆయన ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం.. ఆయన మెప్పుకోసం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. అనవసరంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన ట్రోల్ అవుతున్నారు.
* మూల్యం చెల్లించినా..
గతంలో చంద్రబాబును పొగిడారని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్( superstar Rajinikanth) టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. కొడాలి నాని లాంటి వ్యక్తి అయితే ఏకంగా బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు. రజినీకాంత్ ను తక్కువ చేసి మాట్లాడారు. చివరికి మెగాస్టార్ చిరంజీవిని సైతం వదల్లేదు. పకోడీ గాళ్లు అంటూ కామెంట్స్ చేశారు. అటువంటివి వాటికి ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుసు. అయినా సరే ఈ తరహా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా బిల్ గేట్స్ ను సైతం వదలడం లేదు. ఒక మాజీ ఎమ్మెల్యే.. ఒక టెక్ దిగ్గజం పర్యటనకు సంబంధించి సమోసా ఖర్చులు అడిగారంటే ఇంతకంటే దిగజారుడు ఉంటుందా? కచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీకి చేటు తెస్తాయి. ప్రజల్లో నవ్వుల పాలు గురికాక తప్పదు.