Chandrababu Naidu: మద్యపాన నిషేధమన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డమైన బ్రాండ్లను ఏపీ ప్రజల చేత బలవంతంగా తాగించారు. చివరికి పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి నచ్చిన బ్రాండ్లను తెచ్చుకోవాల్సిన పరిస్థితిని ఏపీ ప్రజలకు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ పరిపాలన కాలంలో మద్యం విధానంలో జరిగిన భాగోతాలు చాలానే ఉన్నాయి. చివరికి మద్యం వ్యవహారంలో జరిగిన కుంభకోణం ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే చాలామంది ఈ వ్యవహారంలో అరెస్టు అయ్యారు. జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాయని మచ్చలాగా మిగిలిపోయిన మద్యం విధానంలో చంద్రబాబు సర్కారు సమూల మార్పులు తీసుకొచ్చింది. రెండు సంవత్సరాల క్రితమే సమగ్రమైన మద్యం విధానం రూపొందించింది. మందుబాబులకు వారు కోరుకున్న బ్రాండ్లు లభించే విధంగా చూసింది. అత్యంత పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు జరిపింది. అయితే ఇటీవల ఆ షాపుల గడుపు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మకాల విషయంలో కూడా సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఏపీలో మద్యం దుకాణాల కాల పరిమితి పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త దుకాణాల ఏర్పాటు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పాలసీని పకడ్బందీగా అమలు చేస్తూ.. విక్రయాలను అత్యంత పాదర్శకంగా చేపట్టాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు సూచించారు. దానికి తగ్గట్టుగానే అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ప్రస్తుతం టెండర్ల గడుపు ముగిసినప్పటికీ.. ఎన్ని దుకాణాలు ఉన్నాయో.. వాటిని రెన్యువల్ చేస్తామని చంద్రబాబు వివరించారు. అయితే మద్యం విక్రయించే విషయంలో ఒక రూపాయి ఎక్కువ తీసుకున్న సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలే ఈ వ్యవహారం మీద దృష్టి సారించాలని సూచించారు.
మద్యం అమ్మకాలలో కృత్రిమ మేధను ఉపయోగించాలని చంద్రబాబు సూచనలు చేయడంతో ఎక్సైజ్ శాఖ ఆదిశగా ఏర్పాటు చేస్తోంది. మద్యం దుకాణాలలో సీసీ కెమెరాలను ఏఐతో అనుసంధానం చేయబోతోంది. షాపులు పనిచేస్తున్న సమయం.. సాగిస్తున్న అమ్మకాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. వచ్చే నెల నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రాబోతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్సైజ్ కేంద్ర కార్యాలయంలో డాష్ బోర్డు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మద్యం దుకాణాల పనితీరును పరిశీలిస్తున్నారు. సమయం దాటిపోయిన సరే మద్యం షాపులు మూయకపోతే.. సమయన కంటే ముందుగానే తెరిచినా వెంటనే అధికారులకు తెలుస్తోంది. మద్యం సీసాలను స్కాన్ చేసిన తర్వాతనే విక్రయాలు జరిపే విధానాన్ని తప్పనిసరి చేస్తున్నారు. మద్యం షాపులలో ఏవైనా అనైతిక కార్యకలాపాలు సాగితే వెంటనే చర్యలు తీసుకునే విధంగా అధికారులు సరికొత్త టెక్నాలజీని రూపొందిస్తున్నారు.