Homeఆంధ్రప్రదేశ్‌AP Pensions : పెన్షన్ రచ్చ : ప్రాణం పోతోంది.. బాబు మెడకు చుట్టుకుంటోంది

AP Pensions : పెన్షన్ రచ్చ : ప్రాణం పోతోంది.. బాబు మెడకు చుట్టుకుంటోంది

AP Pensions : చంద్రబాబు అనుకున్నదే జరిగింది. ఏపీలో పెన్షన్ల రచ్చ చంద్రబాబు మెడకు చుట్టుకుంటుంది. ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా అందాల్సిన పింఛన్లు… ఈనెల అందకుండా పోయాయి. మూడు రోజులపాటు పింఛన్ల పంపిణీలో జాప్యం జరిగింది. ఈరోజు నుంచి ప్రారంభమైంది. అయితే గతం మాదిరిగా కాకుండా.. సచివాలయానికి వెళ్లి పింఛన్ అందుకోవాల్సి రావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఎనిమిది పదుల వయసు దాటిన పండుటాకులు ఆపసోపాలు పడ్డారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పింఛన్ అందుకోవడానికి సచివాలయానికి వెళ్లిన వృద్ధురాలు వడదెబ్బకు గురయ్యారు. అస్వస్థతతో చనిపోయారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టిడిపి చర్యల మూలంగానే ఆ వృద్ధురాలు మరణించిందని వైసిపి ప్రచారం చేయడం ప్రారంభించింది.

ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్ల సేవలు నిలిపివేయాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న వారితో సేవలు కొనసాగించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని ఆరోపించారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. సంక్షేమ పథకాల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించింది. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది. అయితే ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ చేపట్టాల్సి ఉంది. కానీ మూడో తేదీ వరకు పింఛన్లు అందించలేదు. వాలంటీర్లు లేకపోవడం వల్లే పింఛన్ల పంపిణీ నిలిచిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి తెలుగుదేశం పార్టీయే కారణమని.. చంద్రబాబు సూచనతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారని చెప్పుకొస్తోంది. అయితే దీనిపై టిడిపి సైతం రియాక్ట్ అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినందునే పింఛన్లు అందించలేకపోయారని.. ఈనెల 3న పింఛన్ల పంపిణీ చేస్తామని ముందుగానే ప్రకటించారని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సచివాలయ ఉద్యోగులు 11 మందితో పింఛన్లు ఇవ్వచ్చు కదా అని ప్రశ్నిస్తోంది.

అయితే పింఛన్ల జాప్యానికి తెలుగుదేశం పార్టీ కారణమన్న వైసీపీ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇది ప్రతికూలత చూపుతోందని చంద్రబాబు గుర్తించారు. దిద్దుబాటు చర్యలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు టిడిపి బృందాన్ని పంపించారు. తాను సైతం ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారు. తీవ్ర ఎండలు దృష్ట్యా సచివాలయం వద్దకు వెళ్లి.. పింఛన్ తీసుకునేందుకు వృద్ధులు ఇబ్బంది పడతారని.. అందుకే ఇంటికి వెళ్లి పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇలా లేఖ రాసిన గంటల వ్యవధిలోనే.. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం లో ఒక వృద్ధురాలు మృతి చెందింది. పింఛన్ తీసుకునేందుకు సచివాలయానికి వెళ్లి వచ్చిన వృద్ధురాలు వడదెబ్బకు గురైంది. తీవ్ర అస్వస్థతతో చనిపోయింది. విషయం తెలుసుకున్న పెనమలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, మంత్రి జోగి రమేష్, టిడిపి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బాధ్యత కుటుంబాన్ని పరామర్శించారు. ఒకే సమయంలో పరామర్శకు వెళ్లడంతో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ వృద్ధురాలి మృతికి చంద్రబాబు బాధ్యత వహించాలని వైసీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. దీనిని టిడిపి శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి అక్కడ నుంచి పంపించాయి. మొత్తానికైతే ఎన్నికల ముంగిట పింఛన్ పరిణామాలు చంద్రబాబు మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. అటు టిడిపి శ్రేణులు దీనిపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular