Bhogapuram Airport: చుట్టూ దట్టమైన కొండలు.. ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణం.. ఇటువంటి ప్రాంతంలో కను చూపు మేర విమానాశ్రయం.. ఆ దృశ్యాలను చూస్తుంటేనే మనోరంజకం.. పైగా ప్రతి నిర్మాణంలో కొత్తదనం.. ఆధునికత.. అందువల్లే భోగాపురం విమానాశ్రయం సరి కొత్తగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన విశేషాలను పరిశీలిస్తే..
భోగాపురం విమానాశ్రయం కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా ఉంటుంది.. అందువల్లే ఈ విమానాశ్రయాన్ని ఎగిరే చేప మాదిరిగా నిర్మించారు. దీనికి ఫ్లయింగ్ ఫిష్ అని పేరు కూడా పెట్టారు. విమానాశ్రయాన్నిఆధునికంగా నిర్మించారు. సీలింగ్ డిజైన్ ను సంక్రాంతి ముగ్గుల మాదిరిగా నిర్మించారు. టెర్మినల్ గోడల మీద ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉట్టిపడే విధంగా కలంకారి.. బొబ్బిలి వీణలు.. తోలుబొమ్మలు.. నృత్య భంగిమలు. శ్రీశైలం.. తిరుమల.. లేపాక్షి నంది.. మన్యం అడవులు.. కొండపల్లి బొమ్మలు.. ఏటికొప్పాక చిత్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని చిత్రాలు డిజిటల్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటాయి..
భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని జిఎంఆర్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థకు ఢిల్లీ.. హైదరాబాద్ విమానాశ్రయాలను నిర్మించిన చరిత్ర ఉంది. సంస్కృతి మాత్రమే కాకుండా.. సాంకేతికత విషయంలో కూడా జిఎంఆర్ చొరవ తీసుకుంది . ప్రయాణికులకు లగేజీ అప్పగించడానికి ఏకంగా 40 చెకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. 18 ఎకరాలలో టెర్మినల్ భవనం నిర్మించింది. ఇందులో అనేక రకాల వసతులు కల్పించింది. విదేశాలకు వెళ్లే వారికి అత్యాధునికమైన లాంజ్ లు ఏర్పాటు చేసింది.
విమానాశ్రయంలో అత్యాధునిక ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్.. కేటగిరి 1 ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టం.. మోడ్రన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం ను ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే సీసీ టీవీలు, పెరి మీటర్ ఇంట్రోజన్ డిటెక్టర్ సిస్టం.. బాంబులను గుర్తించే పరికరాలను ఏర్పాటు చేశారు.. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా రక్షణ వ్యవస్థలను నిర్మించారు. బోయింగ్ 777, ఎయిర్ బస్ ఏ 350 అత్యంత భారీ కార్గో.. ప్యాసింజర్ విమానాలు కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యేలా విమానశ్రయాన్ని తీర్చిదిద్దారు.
భోగాపురం విమానాశ్రయం వైజాగ్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్.. ఢిల్లీ.. బెంగళూరు వంటి నగరాలు కూడా ఈ విమానాశ్రయానికి చాలా దూరంగా ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం విశాఖపట్నం నుంచి ప్రతి అర్ధగంటకు ఒక బస్సును విమానాశ్రయం వరకు నడిపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే 20 బస్సులను ఆర్టీసీ సిద్ధంగా ఉంచింది. శ్రీకాకుళం జిల్లా వాసులు త్వరగా విమానాశ్రయానికి వచ్చే విధంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. విమానాశ్రయం ద్వారా మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దశలవారీగా సంఖ్యను నాలుగు కోట్ల వరకు పెంచుతామని అధికారులు అంటున్నారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిర్మించారు. రన్వే.. టాక్సీ వే.. ఏఫ్రాన్ వంటి ప్రాంతాలను అనుసంధానిస్తూ టవర్ నిర్మించారు. ఎయిర్ ట్రాఫిక్ ను నిరంతరం పర్యవేక్షిస్తారు.. ట్రాఫిక్ ను పర్యవేక్షించే వ్యవస్థ.. సెకండరీ సర్వేలెన్సు రాడార్.. ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వే లైన్స్ బ్రాడ్ కాస్ట్ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో అత్యాధునిక ఏటీసీ ఆటోమేషన్ సిస్టం ఉంది. ప్రస్తుతం ఇందులో క్యాట్ 1 ల్యాండింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని క్యాట్ 2, 3 కి అప్ గ్రేడ్ చేస్తారు.