YS Jagan Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల రూపాయలను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగింది. మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడి రంగంలోకి దిగింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వారి ఇళ్లల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. అయితే ఏకకాలంలో అటు ప్రత్యేక దర్యాప్తు బృందం, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలు కొనసాగుతున్నాయి. కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరనే దానిపై విచారణ సంస్థలు దృష్టిపెట్టాయి. అంతిమ లబ్ధిదారులకు నోటీసులు అందించేందుకు సిద్ధపడుతున్నాయి.
* ఒక్కొక్కరు అరెస్ట్..
మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్రధారి,సూత్రధారి రాజ్ కసిరెడ్డి. ఆయన అరెస్టు తరువాత మద్యం కుంభకోణం కేసులో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ వచ్చారు. వివిధ కారణాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఓ కేసు విచారణకు హాజరైన ఆయన మద్యం కుంభకోణం కేసులో లీకులు ఇచ్చారు. అప్పటినుంచి అరెస్టుల పర్వం కూడా ప్రారంభమైంది. రాజ్ కసిరెడ్డి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు జరిగింది. మరోవైపు అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, అప్పటి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి ఇలా అందరి అరెస్టులు జరిగాయి. తర్వాత బెయిల్ పై అందరూ బయటకు వచ్చారు. అయితే మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో ఈడి ఎంట్రీ ఇచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి వివరాలు సేకరించి ఒక్కొక్కరిపై నిఘా పెట్టింది. ఈడి విచారణ చేయడమే కాదు సోదాలు కూడా నిర్వహించింది. అయితే ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఈడి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
* మద్యం కంపెనీల నుంచి కమీషన్లు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపింది. అయితే మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇష్టారాజ్యంగా బ్రాండ్లు, నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరకు అని .. అలా వచ్చిన ఆదాయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పంచుకున్నారు అనేది ప్రధాన అభియోగం. దీనిని ఒక వ్యవస్థీకృత నేరంగా విస్తరించారు. అయితే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారందరికీ ఈ కేసులో భాగంగా ఉంది. కానీ అంతిమ లబ్ధిదారుడు మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేది ఒక అనుమానం. ఇప్పుడు కేసు విచారణలో భాగంగా మిగతా నిందితుల వాంగ్మూలంతో.. జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఈడి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
