Warning for AP: ఏపీకి వాతావరణం అనుకూలించేలా ఉంది. గత కొంతకాలంగా తీవ్ర ఎండలు, ఉష్ణోగ్రతతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యాయి. వర్షపాతం లోటు కనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా వాతావరణం లో భిన్న వైఖరి కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అయినా ఇంకా లోటు కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఏపీ తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడుతోంది. మరింతగా విస్తరిస్తోంది. దీని ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన ఉంది. ఈరోజు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదు అవుతాయని చెబుతోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన..
ప్రధానంగా ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాలకు భారీవర్ష సూచన ఉంది. ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు సంతరించుకుంటాయని కూడా చెబుతోంది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ,ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు నమోదు అవుతాయని తెలుస్తోంది. మిగిలిన జిల్లాల్లో సైతం ఆకాశం మేఘావృత్తంగా ఉంటుందని.. చెదురు మదురుగా వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ.
అలెర్టులు జారీ..
ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం, ఎస్ కోట, భీముని పట్నంలో పిడుగులు పడే తీవ్రత అధికంగా ఉండొచ్చు. రాయలసీమకు సంబంధించి అన్నమయ్య, శ్రీ సత్య సాయి, తిరుపతి, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సైతం వర్ష సూచన ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ చెదురు మదురు వర్షాలతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని అంచనా వేసింది. పిడుగులు పడే సమయంలో పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల పెంపకం దారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తోంది. మరోవైపు తీరం వెంబడి మత్స్యకారులు పరిస్థితికి తగ్గట్టు వేటకు వెళ్లాలని కూడా చెబుతోంది.