AP Government : ఏపీలో( Andhra Pradesh) మరో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. మహిళలకు మాదిరిగా పురుషులకు కూడా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయిస్తోంది. వారితో పొదుపు కట్టించి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేలా చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అనకాపల్లి జిల్లాలో గ్రూపులు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. మహిళలే కాదు పురుషులు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా.. స్వయం ఉపాధి పొందేందుకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు కూడా మంజూరు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్రూపులో ఏర్పాటుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఇంటింటికి వెళ్లి అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ పురుషుల డ్వాక్రా గ్రూపుల్లో చేరేందుకు అన్ని రంగాల వారు అర్హులే.
* చంద్రబాబు మానస పుత్రిక చంద్రబాబు( Chandrababu) మానస పుత్రికగా డ్వాక్రా సంఘాలకు పేరు ఉంది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, రిక్షా కార్మికులు, కేర్ టేకర్, ఏసీ వాషింగ్ మిషన్, ప్లంబర్లు, కార్పెంటర్లు.. ఇలా అన్ని రంగాల వారిని గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేయనున్నారు. వారు చేసే వృత్తిలో నైపుణ్యం పెంచేందుకు అవసరమైన సహాయం ప్రభుత్వం అందిస్తుంది. వీరికి శిక్షణ ఇప్పించిన తర్వాత రుణాలు కూడా మంజూరు చేస్తారు. ఆమెకు ఆర్పీలు అర్హులను గుర్తించి.. సంఘాలు ఏర్పాటు చేసిన అనంతరం రుణాలు మంజూరు చేస్తారు.
* మెప్మా సహకారంతో
రాష్ట్రవ్యాప్తంగా పురుషులకు( men ) సంబంధించి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేస్తారు. వారికి మెప్మా సహకారం అందించనుంది. ఒక్కో గ్రూపులో ఐదుగురు నుంచి పది మంది వరకు సభ్యులు ఉంటారు. ఈ గ్రూపులకు తొలి విడతగా పదివేల రుణం మంజూరు అవుతుంది. ఈ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే వచ్చే ఏడాది నుంచి అదనంగా మళ్ళీ రుణం మంజూరు చేస్తారు. గ్రూపు సభ్యుల వృత్తికి తగిన విధంగా రుణాలు కూడా మంజూరు చేయనున్నారు. డ్వాక్రా గ్రూపులుగా ఏర్పాటై స్వయం ఉపాధి పొందాలని ఆసక్తి ఉన్నవారు పట్టణాల్లో అయితే మెప్మా, గ్రామాల్లో అయితే సచివాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది.
* అనకాపల్లి లో ప్రయోగాత్మకంగా
అనకాపల్లి జిల్లాలో( Anakapalli district) ప్రయోగాత్మకంగా ఈ గ్రూపుల ఏర్పాటు జరిగింది. 28 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డును తీసుకెళ్లి యుసిడి కార్యాలయంలో దరఖాస్తులు అందిస్తే వారు గ్రూపును ఏర్పాటు చేస్తారు. పురుషులు కూడా గ్రూపులుగా ఏర్పడితే తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. ఈ రుణాలను సక్రమంగా చెల్లిస్తే డ్వాక్రా సంఘాల మాదిరిగా బ్యాంకులు కూడా రుణ పరిమితిని పెంచుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తానికైతే ఏపీలో పురుషుల డ్వాక్రా సంఘాల ఏర్పాటు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.