Jagan VS Sharmila: సంక్షేమానికి ఆధ్యుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కొట్టిన దెబ్బతో ఉమ్మడి ఏపీలో కకావికలమైన కాంగ్రెస్ పార్టీని విజయపథం వైపు నడిపిన నేత. సుదీర్ఘ పాదయాత్ర చేసి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే కాదు.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి కారణమైన నాయకుడు కూడా ఆయనే. అందుకే కాంగ్రెస్ నాయకత్వం ఆయన ను గౌరవించింది. రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. అయితే ఆయన అకాల మరణంతో జగన్ సీఎం పదవి ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీఆ పని చేయలేదు. దీంతో జగన్ సొంతంగా తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. తన ఉన్నతికి కారణమైన పార్టీని కుమారుడు వీడడంతో వైయస్ ఆత్మ తప్పనిసరిగా బాధపడుతుంది. అదే సమయంలో తన పేరుతో పార్టీని ఏర్పాటుచేసి అధికారంలోకి రావడానికి చూసి వైయస్ ఆత్మ తప్పకుండా సంతోషించి ఉంటుంది.
అయితే తాజాగా కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలు మాత్రం వైయస్ ఆత్మను ఇబ్బందుల్లో నెట్టుతున్నాయి. మొన్న ఆ మధ్యన వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించి జగన్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. నిన్నటికి నిన్న రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టినప్పుడు జగన్ తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ క్రమంలో కుమారుడికి తప్పకుండా వైయస్ దీవించి ఉంటారు. ఇన్ని రోజులు జగన్ను విభేదించారని ప్రచారం జరుగుతున్న తల్లి విజయమ్మ వచ్చి సైతం ఆశీర్వదించారు. దీంతో సహజంగానే వైయస్ సంతోషించి ఉంటారు.
వాస్తవానికి కుమారుడు జగన్ కంటే కుమార్తె షర్మిల అంటేనే రాజశేఖర్ రెడ్డికి ఇష్టమని అంతా చెబుతారు. ఇటీవల ఆమె సోదరుడు జగన్ ను విభేదిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రికి ఇష్టమైన కాంగ్రెస్ పార్టీలో చేరి.. అదే కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు ఆమె. ఈ క్రమంలో తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. దీంతో వైయస్ ఆత్మ ఎంతో సంతోషించి ఉంటుంది. తాజాగా తండ్రి సమాధి వద్ద కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా నుంచి ప్రార్థనలు చేశారు షర్మిల. అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తాను కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే రాజశేఖర్ రెడ్డి ఆత్మ సతమతమై ఉంటుంది. తన కుటుంబంలోనే ఇద్దరు వ్యక్తులు ముఖాముఖి పోటీకి దిగుతుండడాన్ని ఆయన జీర్ణించుకోలేరు. కుమారుడు జగన్ తోనే కుమార్తె షర్మిల ఢీకొట్టడాన్ని అస్సలు ఇష్టపడరు. పైగా తన తమ్ముడు హత్యను అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ పోరు కచ్చితంగా రాజశేఖర్ రెడ్డి కి ఇబ్బందికరమే. అందుకే ఆయన ఆత్మ తప్పకుండా ఘోషిస్తుందని అభిమానులు బాధపడుతున్నారు. కన్నవారే ప్రశాంతత లేకుండా చేస్తున్నారని తప్పు పడుతున్నారు.