Pulivendula: కడప జిల్లాలో నేడు కీలక పరిణామం జరగనుంది. పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల కడప జిల్లాలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు. కొద్ది రోజుల కిందటే కడప జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభించారు. కీలక నియోజకవర్గాల్లో సాగిన ఈ యాత్ర.. ఈరోజు పులివెందులలో అడుగుపెట్టనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే లోక్సభ స్థానం నుంచి షర్మిల పేరును ప్రకటించగా .. పులివెందుల నుంచి ఎవరు పోటీకి దిగుతారన్నది తెలియాల్సి ఉంది. వైయస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ లేదా కుమార్తె సునీత పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
పులివెందుల అంటేనే వైయస్ కుటుంబానికి అడ్డా. సుదీర్ఘకాలం రాజశేఖరరెడ్డి ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అటు తరువాత రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి, మహానేత అకాల మరణంతో విజయమ్మ, అటు తరువాత జగన్ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అయితే వివేకానంద రెడ్డి బతికున్నంత కాలం పులివెందుల నియోజకవర్గం పై గట్టి పట్టు సాధిస్తూ వచ్చారు. కాంగ్రెస్ తో విభేదించి జగన్ బయటకు వెళ్ళినప్పుడు.. పులివెందులకు జరిగిన ఉప ఎన్నికల్లో వివేకానంద రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గౌరవప్రదమైన ఓట్లు సాధించారు. ఇప్పుడు వివేక కుటుంబం నుంచి ఒకరు బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జగన్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కడప జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం కంటే.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూనే ప్రచారం సాగుతోంది. దీనినే షర్మిల తన ప్రచారంలో హైలెట్ చేస్తున్నారు. దీంతో వైసిపి సైతం భయపడుతోంది. ఈ హత్యలో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అవినాష్ రెడ్డిని మార్చుతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ను మరింత ఇరకాటంలో పెట్టాలని షర్మిల భావిస్తున్నారు. వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులనే జగన్ పై నిలబెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలోని కీలక గ్రామాల్లో షర్మిల బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ బస్సు యాత్రలో వైఎస్ సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సైతం పాల్గొనున్నారు. బస్సు యాత్రలోనే పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థిని షర్మిల ప్రకటించే అవకాశం ఉంది. సౌభాగ్యమ్మ, సునీతలో ఎవరో ఒకరు పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. మరోవైపు జగన్ సతీమణి వైయస్ భారతి పులివెందులలో మకాం వేస్తారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. జగన్కు మద్దతుగా ఆమె ప్రచారం చేస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికైతే పులివెందులలో కూర్చొని గెలవాల్సిన సీటులో.. కుటుంబ సభ్యులకు పుణ్యమా అని సీఎం జగన్ తరుపున ప్రచారం చేయాల్సి వస్తోంది. ఇది వైసీపీలో సైతం చర్చనీయాంశంగా మారింది. వివేకానంద రెడ్డి హత్య అంత ప్రభావం చూపుతోందా? అన్న బలమైన చర్చ నడుస్తోంది.