Andhra Pradesh local body elections: ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు.. ఓటర్ల జాబితా.. ఇతర వ్యవహారాలను ఎన్నికల సంఘం అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు ఆయన కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో చాలామందికి పదవులు రాబోతున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటు చేశారు. అంతటితోనే ఆగిపోయారు. శాశ్వతమైన నిర్మాణాలు.. బలమైన కార్య నిర్వాహక వ్యవస్థ.. కొత్త పదవుల భర్తీ వంటివి చేయలేకపోయారు .
జగన్ చేయలేక పోయిన పనిని ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం 13 జెడ్పీలు మాత్రమే ఉన్నాయి. వీటిని 28 చేయాలని ఇటీవల చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయం మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ పరిపాలన కాలంలో మార్కాపురం.. పోలవరం జిల్లాలకు కూడా కూటమి ప్రభుత్వం జడ్పీలను ఏర్పాటు చేసింది. అంతేకాదు కొత్త జిల్లా పరిషత్తుల నిర్వహణ కోసం ఏకంగా 30 కీలకమైన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి తోడు అదనంగా 15 జడ్పీ సీఈవో.. 15 డిప్యూటీ సీఈవో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. సెప్టెంబర్ 24 తో ప్రస్తుతం కొనసాగుతున్న జెడ్పి పాలకవర్గాల పదవీకాలం పూర్తవుతుంది. ఇది పూర్తి అయిన వెంటనే 28 కొత్త జడ్పీ ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు 660 మండలాలను కొత్త జిల్లా పరిషత్ పరిధిలోకి మ్యాపింగ్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
జెడ్పిల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ముందు చూపుతో ఉన్నారు. వివాదాస్పద.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కాకుండా కొత్త జడ్పీ లకు ప్రస్తుతం ఉన్న పారదర్శకమైన సిబ్బందిని ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. పురపాలక ఎన్నికలు పూర్తి కాకముందే జిల్లా పరిషత్ లకు సంబంధించిన పునర్విభజన ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త జిల్లాలవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముఖ్యమంత్రి నిర్ణయంతో పరిష్కారం కాబోతున్నాయి. ఆశావాహుకులకు కొత్తగా పదవులు కూడా దక్కబోతున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం కూడా మారనుంది.