AP cabinet expansion: ఏపీలో( Andhra Pradesh) మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? అసలు దానికి ఛాన్స్ ఉందా? చంద్రబాబు సాహసం చేస్తారా? ఇప్పుడిప్పుడే మంత్రులు శాఖలపై పట్టు సాధిస్తున్న క్రమంలో మార్పు అవసరమా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఇటీవల ఎక్కువైంది. ఓ ఐదుగురు వరకు కొత్తవారు మంత్రులు అవుతారని సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఉత్తరాంధ్రలో ముగ్గురు, గోదావరిలో ఒకరు, నెల్లూరుకు చెందిన ఒక మహిళా నేతకు మంత్రి పదవులు ఖాయమని ఒక హడావిడి నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో కొన్ని సమీకరణల మార్పు కోసం ఈ విస్తరణ తప్పదని కొందరు ప్రచారం చేశారు. అయితే సీఎం చంద్రబాబు ఇంతవరకు ఎటువంటి కసరత్తు చేయలేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
గాడిన పడుతున్న మంత్రులు..
అయితే ప్రభుత్వం ఇంకా రెండేళ్లు పూర్తి చేసుకోలేదు. జూన్ నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. ఇప్పుడిప్పుడే మంత్రులు తమ శాఖలపై పట్టు సాధిస్తున్నారు. ఇటువంటి సమయంలో చంద్రబాబు ఇంతటి సాహసం చేస్తారా? అనేది ఒక అనుమానం. ప్రస్తుతం రాజకీయాల కంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై దృష్టిపెట్టారు చంద్రబాబు. అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను పట్టాలెక్కించడంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పైగా ప్రభుత్వం ఏర్పాటైన తక్కువ సమయంలోనే విస్తరణ చేపడితే అనవసర రాజకీయ రచ్చకు కారణం అవుతుందని చంద్రబాబుకు తెలుసు. పైగా ఇప్పుడు ఉన్న మంత్రుల పనితీరును నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. అసలు రెండేళ్లు పూర్తి కాకుండా మంత్రివర్గ విస్తరణ ఆలోచన సరికాదన్న అభిప్రాయం చంద్రబాబులో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Also Read: ఏపీ బీజేపీకి ఏమైంది?!
ఆ ప్రచారం వెనుక..
ఒకటి మాత్రం నిజం. క్యాబినెట్లో మంత్రులంతా దాదాపు కొత్తవారే. చాలామంది సీనియర్లు ఆశావహులుగా ఉన్నారు. పైగా కీలక నేతలు సైతం ఉన్నారు. అయితే వారికి వివిధ సమీకరణలో ఛాన్స్ రాలేదు. విస్తరణలో ఛాన్స్ ఇచ్చి ఆ టీం తో ఎన్నికలకు వెళ్తారు అన్న ఒక ఆలోచన ఉంది. అందుకే మంత్రి పదవులు ఆశిస్తున్న వారు అలా తమకు తాము లీకులు ఇస్తున్నారు. తమ పేర్లను చర్చలో ఉంచడానికి కొంతమంది అలా ప్రచారం చేయిస్తున్నారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరోవైపు కూటమిలో విభేదాలు సృష్టించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా ప్రయత్నం చేస్తుందన్న అనుమానం కూడా ఉంది. అయితే చంద్రబాబు పనితీరుకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. పైగా మంత్రివర్గ విస్తరణ అనేది రెండున్నరేళ్ల తర్వాత.. చివరి రెండేళ్లకు చేస్తారు. అందుకే చంద్రబాబు అటువంటి ప్రయత్నాలు చేయరు అనేది ఒక విశ్లేషణ.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణ పనుల వేగవంతం వంటి లక్ష్యాలను విధించుకుంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం రాజకీయ సమీకరణల కంటే ప్రజలకు ఇచ్చిన హామీలపైనే దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. మరోవైపు నిన్న మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. ఉగాదికి మార్పులు చేస్తామనుకుంటే ఇప్పుడు ఉన్న మంత్రులను మానసికంగా సిద్ధం చేసేవారు. కానీ వాటి జోలికి పోలేదని మంత్రులు చెబుతున్నారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ అనేది కేవలం ప్రచారం మాత్రమేనని.. అందులో ఏం వాస్తవం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
