AP BJP latest situation: జాతీయస్థాయిలో భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) దూకుడుగా ఉంది. చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. కానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది పరిస్థితి. పివిఎన్ మాధవ్ పగ్గాలు తీసుకున్నాక పరిస్థితుల్లో మార్పు ఉంటుందని అంతా భావించారు. ఆయన కూడా బాధ్యతలు తీసుకున్నాక చాలా వేగంగా పావులు కదిపారు. కానీ ఎందుకో ఇటీవల ఫుల్ సైలెన్స్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలు కూడా తగ్గాయి. ముఖ్యంగా పార్టీలో కార్యవర్గ విభాగాల ఏర్పాటు కూడా జరగలేదు. పక్కనే ఉన్న తెలంగాణలో కొత్త కార్యవర్గాలను ప్రకటించారు. కొత్త కొత్త నేతలకు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏమో కూటమిలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు ఉంది వారి పరిస్థితి.
పెద్ద పెద్ద నేతలు ఉన్నా..
మొన్నటి ఎన్నికల్లో ఓట్లతో పాటు సీట్లను పెంచుకుంది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ తరపున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ముగ్గురు లోక్సభ సభ్యులు అయ్యారు. కేంద్రమంత్రిగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ( Bhupathi Raju Srinivasa Varma ) ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా సత్య కుమార్ యాదవ్ ఉన్నారు. మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారు. ఎంపీలుగా పురందేశ్వరి, సీఎం రమేష్.. ఎమ్మెల్యేలుగా విష్ణుకుమార్ రాజు, సుజనా చౌదరి వంటి సీనియర్లు కొనసాగుతున్నారు. అయినా సరే పార్టీకి ఒక ఊపు తేలేకపోతున్నారు. దీనికి ఏం కారణం అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. పొత్తుతో ముందుకు వెళ్తున్నారు సరే. కానీ పార్టీ కార్యక్రమాల విషయంలో సైతం వెనుకబాటు కనిపిస్తోంది. ఇది పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు. పార్టీ బలోపేతం అనేది భవిష్యత్తు కలగానే మిగిలిపోతోంది.
Also Read: ప్రతిపక్షాల కుట్ర అన్న మాట లేకుండా.. లోకేష్ పనికి ఫిదా!
టిడిపి కంటే సీనియర్..
భారతీయ జనతా పార్టీ ఇప్పటిది కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే సమయానికి ఏపీలో ఎంటర్ అయింది ఆ పార్టీ. ఉమ్మడి ఏపీలో విశాఖ మహానగరంలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్ పదవిని సొంతం చేసుకుంది బిజెపి. అటు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అంతకంటే ముందే విజయాన్ని దక్కించుకున్న బీజేపీ మాత్రం వెనుకబడిపోయింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే పదుల సంఖ్యలో సీట్లు దక్కించుకుంటోంది. లేకుంటే ఉనికి చాటుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితి దశాబ్దాలుగా మారడం లేదు. నాయకత్వాలు మారినా సరైన ఫలితం దక్కడం లేదు బిజెపికి. యావత్తు భారతదేశాన్ని ఆవహిస్తున్న బిజెపి.. ఏపీలో ఎందుకు వెనుకబడిపోతుంది అనేది ఇప్పటికీ ధర్మసందేహమే.
