Vijayasai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయసాయిరెడ్డి పై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నాయి. ఇటీవల ఆయన చేస్తున్న కామెంట్స్ పై ఆగ్రహంగా ఉన్నాయి. ఆయన టిడిపి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే టిడిపిపై ఆయన చేసే విమర్శలు కు అంత లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన గతం నుంచి టిడిపి అంటేనే విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో విజయసాయిరెడ్డి చేస్తున్న కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు అని.. కనీసం పాలన తెలియదని.. వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. మనుషుల్లో ఇంత విశ్వాస ఘాతుకులు ఉంటారా? అని ప్రశ్నించిన వారు ఉన్నారు. దశాబ్దాలుగా ఆ కుటుంబం వద్ద బతికిన విజయసాయి రెడ్డికి ఇది తగదు అన్నవారు ఎక్కువ.
అప్పట్లో జగన్ కోసమే అంటూ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడాదిన్నర కిందట గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. అయితే అప్పట్లో విజయసాయిరెడ్డి వ్యవహార శైలిపై అనేక రకాల అనుమానాలు ఉండేవి. జగన్ కోసమే ఆయన ఈ పని చేశారని.. జగన్ కోసం బిజెపిలో చేరుతారని.. అక్కడ చేరాక టిడిపిని ఎన్డీఏ నుంచి బయటకు పంపిస్తారని అంచనా వేశారు వైసీపీ శ్రేణులు. పైగా విజయసాయిరెడ్డి లో ఉన్నది వైసిపి రక్తం. ఆపై వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల వీర విధేయత. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటు కూడా. ఈ కారణాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం విజయసాయిరెడ్డి విషయం లో బలంగా నమ్మాయి. ఆయన బయటకు వెళ్లడం పార్టీ కోసం అని భావించాయి. అలా జరగకపోయేసరికి ఇప్పుడు ఆందోళనతో అదే విజయసాయి రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సాయి రెడ్డి డోస్ పెంచడంతో..
విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసమే పార్టీని విడిచిపెట్టి వెళ్లారు అనేది ఆ పార్టీ శ్రేణుల ప్రగాఢ నమ్మకం. పైగా విజయసాయిరెడ్డి సైతం ఒక్క జగన్మోహన్ రెడ్డి ని గౌరవిస్తూనే ఇతర వైసీపీ నేతలను టార్గెట్ చేసుకునేవారు. మళ్లీ పార్టీలోకి వచ్చేందుకే ఇలా ఆప్షన్ ఉంచుకున్నారు అనేది ఒక అభిప్రాయంగా ఉండేది. ఇటీవల ఆయనను వైసీపీలోకి రప్పించేందుకు చర్చలు కూడా జరుగుతున్నాయి అన్న ప్రచారం నడిచింది. దీనిపై కూడా ఆనందం వ్యక్తం చేశారు వైసీపీ శ్రేణులు. కానీ ఆయన తిరుమల సన్నిధిలో ఒక ప్రకటన చేశారు. విజయవాడ వేదికగా పార్టీని ప్రకటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అప్పటినుంచి వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అనుమానం ప్రారంభమైంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో విపరీతంగా మతమార్పిడులు జరిగాయని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని ఒక అసమర్ధ నేతగా చిత్రీకరిస్తున్నారు. ఇవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. అందుకే విజయసాయిరెడ్డి అంటేనే రగిలిపోతున్నారు. మరి ఆయన పార్టీ పెట్టిన తర్వాత దీనికి మించి డోసు ఉంటుందన్నది పొలిటికల్ వర్గాల మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.