Manhole cover theft Pakistan: పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకు పతనమవుతోంది. ఇతర దేశాలు అప్పులు ఇస్తే తప్ప పాకిస్తాన్ రోజువారీ వ్యవహారాలు ముందుకు సాగడం లేదు. విదేశీ మారకద్రవ్యం రోజురోజుకు తగ్గిపోతుంది. కంపెనీలు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. అభివృద్ధి లేదు. ఉపాధి కల్పించే అవకాశం లేదు. అక్షరాస్యత అంతంత మాత్రం.. పాలకులకు సొంత ఆస్తులను పెంచుకోవడం.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంతోనే సరిపోతుంది. దీనికి తోడు ఉగ్రవాదుల కార్యకలాపాలు.. పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలు చేస్తున్నాయి.
పాకిస్తాన్లో ఇప్పటివరకు కరువు కాటకాలు వచ్చాయి. అపారమైన వర్షాలు కూడా కురిసాయి. భూకంపాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇక రాజకీయంగా అస్థిరత్వ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇన్ని జరిగినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రజలు ఎన్నడు దిగజారి బతకలేదు. కానీ కొంతకాలంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోవడంతో ప్రజల జీవితం మీద తీవ్రంగా ప్రభావం పడుతోంది.
తాజాగా అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో అక్కడి ప్రజలు ఇనుప మ్యాన్ హోల్ మూతలను రాత్రికి రాత్రే ఎత్తుకుపోతున్నారు. వాటిని ఇనుప షాపులలో అమ్మేస్తున్నారు. వచ్చిన డబ్బులతో సరుకులు కొనుగోలు చేసి.. బతుకుతున్నారు. ఈ వ్యవహారం అక్కడి ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దీంతో పంజాబ్ సీఎం మరియం నవాజ్ కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. మ్యాన్ హోల్ మూతలను దొంగిలించినా.. కొనుగోలు చేసినా.. ఒకటి నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని.. 50 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
” అక్కడి ప్రజల బతుకు దారుణంగా మారింది. ఉపాధి లేదు. చేద్దామంటే పనిలేదు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్దామంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఇలాంటప్పుడు ఎలా బతకాలి.. ఎలా జీవన సాగించాలి.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక అక్కడి ప్రజలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ పరిపాలకులు మొద్దు నిద్ర వీడిపోవడం లేదని” అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
