Trump Controversy: పిస లేసిన కుక్క ఊరంతా మొరిగిందట. ఎదురైన వాళ్లను కరిచిందట. కర్ర అందుకొని నాలుగు దెబ్బలు పెడితే ముక్కు మూసుకొని సచ్చిందట. వెనుకటి కాలంలో మన పెద్దలు ఈ లోకోక్తిని విరివిగా వాడేవారు. ఇప్పుడు ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సరిపోతుంది.
తనకు నచ్చితే ప్రపంచం మొత్తం నచ్చాలి. తనకు నచ్చకపోతే ప్రపంచం మొత్తం దూరం పెట్టాలి. అమెరికా ప్రయోజనాలు మాత్రమే ప్రపంచ ప్రయోజనాలు కావాలి. అమెరికా కష్టం ప్రపంచ కష్టం కావాలి. అమెరికా ఆనందం ప్రపంచ ఆనందం కావాలి. ఇదిగో ఇలానే సాగిపోతోంది ట్రంప్ వ్యవహార శైలి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్.. అమెరికాను గ్రేట్ చేయడం లేదు. సరి కదా మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నాడు. అడ్డగోలుగా ప్రవర్తిస్తూ అమెరికా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు. అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది కాకముందే అమెరికా వ్యాప్తంగా ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారంటే అతని పరిపాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని అపహరించి చరిత్రలో అత్యంత దారుణమైన తప్పు చేసిన ట్రంప్.. ఇప్పుడు ఇజ్రాయిల్ కోసం ఇరాన్ మీద చేస్తున్న యుద్ధంతో మరింత చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు.
ట్రూత్ సోషల్ లో అడ్డగోలుగా మాట్లాడే ట్రంప్.. తాజాగా అమెరికన్ రేడియో వ్యాఖ్యాత మైకేల్ షేర్ చేసిన లేఖను రీ పోస్ట్ చేశాడు. ఇందులో మైఖేల్ అమెరికాను, చైనాను నరకాలతో పోల్చాడు. దానిని ట్రంప్ షేర్ చేశాడు.. దీని పట్ల గట్టిగా ఇరాన్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడికి మతి పోయినట్టుందని వ్యాఖ్యానించింది. నాగరికతకు భారత్, చైనా పుట్టినిల్లని హైదరాబాదులోని ఇరాన్ ఎంబసీ కామెంట్ చేసింది. “చైనా, భారతదేశానికి చెందిన కొంతమంది మహిళలు గర్భం దాల్చుతున్నారు. 9 నెలల సమయంలో అమెరికాకు వస్తున్నారు. ఇక్కడ పిల్లలని కంటున్నారు. ఇక్కడ ఉన్న చట్టం కారణంగా ఆ పిల్లలు అమెరికా పౌరులు అయిపోతున్నారు. ఆ తర్వాత వారు అక్కడి నరకప్రాయ దేశాల నుంచి తమ కుటుంబ సభ్యులను ఇక్కడికి తీసుకొస్తున్నారు.. చైనా, భారతదేశానికి చెందిన వారంతా లాప్టాప్ పట్టుకున్న గ్యాంగ్ స్టర్లు” అంటూ మైకేల్ ఒక లేఖను షేర్ చేశాడు. దీనిని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో రీ పోస్ట్ చేశాడు.
వాస్తవానికి ట్రంప్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అమెరికా అనేది వలస దేశం. ఇతర దేశాల వారు అక్కడికి వచ్చిన తర్వాతే దాని ఆర్థిక అభివృద్ధి సాధ్యమైంది. ప్రపంచ దేశాల మీద యుద్ధాలు చేసి అమెరికా అడ్డగోలుగా సంపాదించింది. రష్యా పెత్తనాన్ని సహించలేక తెరవెనక కుట్రలు చేసింది. ఇప్పుడు ట్రంప్ చెబుతున్నట్టుగా అమెరికా నుంచి ఇతర దేశాల చెందినవారు బయటికి వస్తే.. అప్పుడు ఆ దేశం అడుక్కుతినాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికా అనేది ఒక పరాన్న జీవి దేశం లాంటిది.
ట్రంప్ వ్యాఖ్యల పట్ల భారతదేశం కూడా తీవ్రంగానే స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని.. తమ దేశం మీద అడ్డగోలుగా మాట్లాడితే అందుకు తగిన పర్యవసనాలు ఉంటాయని హెచ్చరించింది. దీంతో సోషల్ మీడియా నుంచి ట్రంప్ ఆ పోస్టును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భారత్ గ్రేట్ అంటూ కామెంట్ చేసినట్టు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ట్రంప్ నాలుక మడత పెట్టడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. ప్రపంచ దేశాల మీద సుంకాలు విధిస్తూ.. శునకానందం పొందుతున్నాడు. ఇప్పుడు భారత్ మీద తన విష స్వభావాన్ని ప్రదర్శిస్తూ మరోసారి.. తన అక్కస్సును బయట పెట్టుకున్నాడు.