Pakistan Defence Minister: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్కు కొన్ని రోజులుగా నోరు లేస్తోంది. భారత్, కశ్మీర్ విషయంలో అనవసంగా ధూషణలు చేస్తున్నాడు. కవ్వింపు చర్యలకు దిగుతున్నాడు. ఇటీవలే సిందూ జలాల విషయంలో యుద్ధానికైనా సిద్ధమని ప్రకటించాడు. తాజాగా కశ్మీర్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చాడు. ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్లో అస్థిరత, ద్వంద్వ విధానాలను సూచిస్తున్నాయి. కశ్మీర్ ప్రజలను హెచ్చరిస్తూ, మిర్పూర్, రావల్కోట్ వంటి ప్రాంతాల ప్రజలను ఎవరినీ నమ్మవద్దని, వారిని తాము మనుషులుగా కూడా చూడడం లేదని పేర్కొన్నాడు.
పీవోకే ఆక్రమణ అంగీకారం..
ఖవాజా ఆసిఫ్ మాటలను గమనిస్తే పీవోకే(పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్)ను తాము అక్రమంగా నియంత్రణలోకి తీసుకున్నట్లు పరోక్షంగా అంగీకరించాడు. సాధారణంగా పాకిస్తాన్ పీవోకేను స్వతంత్ర దేశంగా చిత్రీకరిస్తూ, దానికి ప్రత్యేక హోదా ఉందని చెబుతూ వస్తుంది. కానీ ఆయన వ్యాఖ్యలు ఆ ప్రాంతంపై పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోందని, దానిని తన నియంత్రణలో ఉంచుకున్నట్లు సూచిస్తున్నాయి. ఇది దశాబ్దాలుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉంది.
సైనిక త్యాగాలు, ఆర్థిక సహాయం అంటూ..
ఖవాజా ఆసిఫ్ పీవోకే ప్రజల కోసం పాకిస్తాన్ ఎంతో చేసిందని, తమ సైన్యం ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ వాదన ఆ ప్రాంత ప్రజల్లో భావోద్వేగాన్ని రేకెత్తించడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. అయితే పీవోకేలోని ప్రజల జీవన పరిస్థితులు, అభివృద్ధి, స్వేచ్ఛ వంటి అంశాలపై ఇప్పటికీ ప్రశ్నలు ఉన్నాయి. సైనిక త్యాగాలను ముందుకు తెచ్చి భావోద్వేగాన్ని రేకెత్తించడం రాజకీయంగా సాధారణ వ్యూహం అయినప్పటికీ, ఆ ప్రాంతంలోని వాస్తవ పరిస్థితులతో పోల్చినప్పుడు అది సరిపోదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ద్వంద్వ వైఖరి..
ఒకవైపు పీవోకేను స్వతంత్రంగా చిత్రీకరించి, మరోవైపు దానిపై పూర్తి నియంత్రణ చెలాయించడం పాకిస్తాన్ వైఖరిలోని ద్వంద్వత్వాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఖవాజా ఆసిఫ్ వాళ్లను మనుషులుగా చూడకండి అని చేస్తున్న పిలుపు రక్షణను బలహీనం చేస్తున్నాయి.
ఖవాజా వ్యాఖ్యలు భారత్–పాకిస్తాన్ సంబంధాలు, కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ చర్చల్లో కొత్త కోణాన్ని తెస్తున్నాయి. పాకిస్తాన్ ఎప్పుడూ కశ్మీర్ ప్రజల హక్కుల కోసం మాట్లాడుతూ వచ్చినా, పీవోకేలోని ప్రజల పరిస్థితి గురించి అదే స్థాయిలో చర్చించడం లేదనే వాదనలు బలపడుతున్నాయి.
