ఐదు రోజుల క్రితం సూయిజ్ కాల్వలో చిక్కకున్న ‘ఎవర్ గివెన్’ అనే భారీ నౌకను పక్కకు తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం 9 ఓడలు ఈ నౌకను కదిలించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. ఈ పని మొత్తం పూర్తయ్యి, ఆ నౌక ప్రయాణం సాగడానికి ఎన్ని రోజులు పడుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 8 సంవత్సరాలపాటు 14 ఓడలు కాలువలో చిక్కకుపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటోంది ప్రపంచం.
ఆసియా, ఆఫ్రికాల మధ్య ఉన్న ఈ కాల్వ పొడవు మొత్తం 193 కిలోమీటర్లు. ఈజిప్టులో ఉన్న ఈ జలమార్గం ఓ మానవ నిర్మితం. 1869లో దీన్ని ప్రారంభించారు. అయితే.. 1967లో ఈజిప్టు-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదే ఏడాది జూన్ 5న యుద్ధం మొదలైంది. అయితే.. అప్పటికే 14 ఓడలు సూయిజ్ కాల్వలోకి ప్రవేశించాయి. ఈ కాల్వను కూడా యుద్ధ ప్రాంతంగా ప్రకటించిన ఈజిప్టు.. ఆ నౌకలను గ్రేట్ బిట్టర్ సరస్సు వద్ద ఆపేయాలని ఆదేశించింది. దీంతో.. అవన్నీ అక్కడే నిలిచిపోయాయి.
ఆరు రోజుల యుద్ధం తర్వాత సూయిజ్ కాల్వ తూర్పు తీరాన్ని ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది. పశ్చిమ తీరం ఈజిప్టు పరిధిలో ఉంది. అయితే.. ఈ కాల్వను ఇజ్రాయిల్ ను ఉపయోగించుకోవద్దనే ఉద్దేశంతో తనవైపు ఉన్న పశ్చిమ ప్రాంతాన్ని ఈజిప్టు మూసేసింది. ఓడల రాకపోకలు జరగకుండా ముఖద్వారం వద్ద పెద్ద పెద్ద లాండ్ మైన్లు, పాత ఓడలను వేసి కుక్కేసింది. దీంతో ఆ 14 ఓడలు సూయిజ్జలాల్లోనే మిగిలిపోయాయి. నెలలు, సంవత్సరాలు గడిచాయి. అయినప్పటికీ.. ఆ ఓడలు బయటకు రాలేదు.
1973లో ఈజిప్టు-ఇజ్రాయెల్ మధ్య రెండోసారి యుద్ధం జరిగింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం రెండు ప్రాంతాలూ జలరవాణాకు దారి వదిలాయి. అయితే.. ఈజిప్టు వేసిన పాత ఓడలు, చెత్తాచెదారం తొలగించడానికి ఏకంగా 2 సంవత్సరాల కాలం పట్టింది. ఆ విధంగా 1975 జూన్ 5న ఆ కాల్వ తెరుచుకుంది. అంటే.. సరిగ్గా ఎనిమిది సంవత్సరాల తర్వాత రాకపోకలు జాగాయి.
మరి, అందులోని జనం సంగతేంటనే డౌట్ వచ్చిందా..? వఆరు కూడా దాదాపు మూడు నెలలు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిని బయటకు వచ్చేందుకు ఈజిప్టు అనుమతించింది. ఓడలు మాత్రమే అక్కడే ఉంచాలని చెప్పింది. అయితే.. అందులోని సిబ్బందిని మాత్రం అక్కడే పనిచేయాలని ఆయా ఓడలకు చెందిన యజమానులు అన్నారు. వాటి బాగోగులు చూసుకోవాలని చెప్పడంతో.. పనిలేకుండానే ఆటపాటలతో విధులు నిర్వర్తించారు సిబ్బంది. ఆ విధంగా.. సూయజ్ లో నౌకలు ఉండిపోయిన సుదీర్ఘ కాలం ఇదే.